Congress Visa Scam

వీసా స్కామ్‌ నిందితుల్లో కాంగ్రెస్‌ నేత

మెరికాలో ఉద్యోగం చేయాలన్న భారతీయ యువత కలలను సొమ్ము చేసుకొనేందుకు కొందరు అక్రమార్కులు హెచ్‌-1బీ వీసాలను తమకు నచ్చినవారికి వచ్చేలా లాటరీ రిగ్గింగ్‌కు పాల్పడుతున్నట్టు అమెరికాకు చెందిన అంతర్జాతీయ మీడియా సంస్థ  ‘బ్లూమ్‌బర్గ్‌’ ఓ సంచలన కథనంలో వెల్లడించింది. ఆదిలాబాద్‌ కాంగ్రెస్‌ నేత కంది శ్రీనివాస్‌ రెడ్డి ఈ స్కామ్‌ నిందితుల్లో ఒకరని వివరాలతో సహా బయటపెట్టింది. 

అమెరికా టెక్‌ కంపెనీలు ఈ వీసాపై ఆధారపడి ఏటా భారత్‌, చైనా వంటి దేశాల నుంచి వేలాది మంది ఉద్యోగులను నియమించుకొంటున్నాయి. ఏటా పరిమిత సంఖ్యలో 85వేల హెచ్‌-1బీ వీసాలను మాత్రమే జారీ చేస్తారు. వీటి కోసం లక్షల మంది దరఖాస్తు చేసుకొంటూ ఉంటారు. ప్రారంభంలో  ‘ఫస్ట్‌ ఇన్‌ ఫస్ట్‌ అవుట్‌’ ప్రాతిపదికన వీసాలను జారీ చేసినప్పటికీ గత కొన్నేండ్లుగా కంప్యూటరైజ్డ్‌ జనరేటెడ్‌ లాటరీ ద్వారా ఎంపిక చేసి అర్హులైన వారికి వీసాలు ఇస్తున్నారు. అయితే, ఈ లాటరీ ప్రక్రియలో కొన్ని కంపెనీలు మోసాలకు పాల్పడుతున్నట్టు  ‘బ్లూమ్‌బర్గ్‌’ పరిశీలనలో తాజాగా తేలింది. బ్లూమ్‌బర్గ్‌ బృందం వీసా దరఖాస్తులు, వీసాల జారీ, లాటరీ ప్రక్రియకు సంబంధించిన పూర్తి వివరాలను అమెరికా ప్రభుత్వం ఇచ్చిన డేటా సాయంతో విశ్లేషించింది. ఒకే అభ్యర్థి పేరును వివిధ కంపెనీల ద్వారా కోట్‌ చేస్తూ ఒకటి కంటే ఎక్కువ రిజిస్ట్రేషన్లు దాఖలు చేసినట్టు బ్లూమ్‌బర్గ్‌ వెల్లడించింది. ఇలా ఒక్క ఏడాదిలోనే 15,500 వీసాలు పక్కదారి పట్టినట్టు వివరించింది. నాలుగేండ్ల వ్యవధిలో, ఒక కంపెనీ ఒకే దరఖాస్తుదారుడి పేరును ఏకంగా 15సార్లు రిజిస్టర్‌ చేసినట్టు, దీని కోసం డజనుకు పైగా కంపెనీలను వాడుకొన్నట్టు వెల్లడించింది. ఆదిలాబాద్‌ కాంగ్రెస్‌ నేత కంది శ్రీనివాస్‌ రెడ్డి పలు కంపెనీల సాయంతో ఈ లాటరీ రిగ్గింగ్‌లో భాగమైనట్టు బ్లూమ్‌బర్గ్‌ వెల్లడించింది. 2020 నుంచి ఇప్పటి వరకూ ఈయన  కంపెనీలకు 300కు పైగా హెచ్‌-1బీ వీసాలు దక్కినట్టు వివరించింది. మెషీన్‌ లర్నింగ్‌ టెక్నాలజీస్‌ ఎల్‌ఎల్‌సీ, డేటా సైన్స్‌ టెక్నాలజీస్‌ ఎల్‌ఎల్‌సీ, రోబోటిక్స్‌ టెక్నాలజీస్‌ ఎల్‌ఎల్‌సీ ఇలా ఒకే పేరును స్ఫురించేలా దాదాపు 15 కంపెనీల ద్వారా శ్రీనివాస్‌ రెడ్డి ఈ రిగ్గింగ్‌లో పాల్గొన్నట్టు తమ విశ్లేషణలో వెల్లడైందని బ్లూమ్‌బర్గ్‌ తెలిపింది. శ్రీనివాస్‌ రెడ్డిని  ‘మ్యాన్‌ బిహైండ్‌ ఏ స్కీమ్‌’ అని పేర్కొంటూ ఈ వివరాలను బ్లూమ్‌బర్గ్‌ ప్రత్యేకంగా ప్రచురించింది. 

ఆదిలాబాద్‌ జిల్లా తలమడుగు మండలం హస్నాపూర్‌కు చెందిన కంది శ్రీనివాస్ రెడ్డి అమెరికాలో పలు సాఫ్ట్‌వేర్‌ సంస్థలను నడిపిస్తున్నారు. ఎమ్మెల్యే కావాలన్న ఆకాంక్షతో రెండేండ్ల కిందట రాజకీయాల్లోకి ప్రవేశించారు. తొలుత బిజెపిలో చేరారు. అయితే, ఆ పార్టీలో టికెట్‌ లభించే అవకాశం లేకపోవడంతో అసెంబ్లీ ఎన్నికలకు ఆరు నెలల ముందు కాంగ్రెస్‌లో చేరి ఆదిలాబాద్ నుండి ఎమ్యెల్యేగా పోటీ చేసి ఓడిపోయారు. ఈయన రాకను పార్టీ సీనియర్‌ నాయకులు తీవ్రంగా వ్యతిరేకించినా కాంగ్రెస్‌ అధిష్టానం పట్టించుకోలేదు. ఎమ్మెల్యే టికెట్‌ లక్ష్యంగా పార్టీ అధిష్టానం పెద్దలకు భారీగా డబ్బులు ఇచ్చి కాంగ్రెస్‌లో చేరినట్టు ప్రచారం జరిగింది. స్థానిక పార్టీ నాయకులను కాలదన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అండదండలతోనే పార్టీలో చేరడం, అభ్యర్థిగా పోటీ చేయడం జరిగిపోయినట్లు చెప్పుకొంటున్నారు. ఆర్థికంగా బలమైన వ్యక్తి కావడంతో ఎన్నికలకు ముందు ఆదిలాబాద్‌ నియోజకవర్గంలో ప్రజలకు పెద్ద సంఖ్యలో ఈయన కుక్కర్లు పంపిణీ చేయడంతో ఎన్నికల కమిషన్ కన్నెర్ర చేసింది. పార్టీతో సంబంధం లేని వారికి సీట్లు ఇచ్చారని అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ లో చెలరేగిన వివాదం పార్టీ అధిష్టానం వరకు వెళ్లడం తెలిసిందే. ఈ కుంభకోణం గురించి ఇప్పటి వరకు కాంగ్రెస్ వారెవ్వరూ నోరు మెదపక పోవడం గమనార్హం.

కృష్ణ చైతన్య