దిల్లీ ముఖ్యమంత్రిగా రేఖా గుప్తా ప్రమాణం
దిల్లీలో బిజెపి ప్రభుత్వం కొలువుతీరింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర మంత్రులు, బిజెపి ముఖ్యమంత్రులు, ఎన్డీయే పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు, ఉప ముఖ్యమంత్రులు, ఇతర ప్రముఖుల సమక్షంలో ఫిబ్రవరి 20న దిల్లీ 9వ ముఖ్యమంత్రిగా రేఖా గుప్తా ప్రమాణం చేశారు. లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనా మంత్రివర్గ ప్రమాణాలు చేయించారు. దిల్లీ రామ్లీలా మైదానంలో జరిగిన ఈ కార్యక్రమానికి వేలాది కార్యకర్తలు పాల్గొన్నారు. మంత్రులుగా ప్రమాణం చేసిన వారిలో పర్వేశ్ వర్మ, మంజిందర్ సింగ్ సిర్సా, కపిల్ మిశ్రా, ఆశిశ్ సూద్, రవీందర్ ఇంద్రజ్ సింగ్, పంకజ్ సింగ్ ఉన్నారు. ముఖ్యమంత్రి రేఖా గుప్తా ఆర్థిక, విజిలెన్స్ శాఖలతో పాటు, మహిళా, శిశు సంక్షేమ, సాధారణ పరిపాలన శాఖలు తన వద్దే ఉంచుకున్నారు. పర్వేశ్ వర్మకు ప్రజాపనులు, జలవనరులు, వ్యవసాయ శాఖలు కేటాయించారు. ఆశిశ్ సూద్కు హోం, విద్య, పట్టణాభివృద్ధి శాఖలను కేటాయించారు. మంజిందర్ సింగ్ సిర్సాకు పరిశ్రమలు, పర్యావరణ శాఖలు, కపిల్ మిశ్రాకు న్యాయ, పర్యాటక శాఖలను, పంకజ్ కుమార్ సింగ్కు ఆరోగ్యశాఖ, రవీందర్ ఇంద్రజ్ సింగ్కు సామాజిక సంక్షేమ శాఖలను కేటాయించారు. ఆ తర్వాత సచివాలయంలో రేఖా గుప్తా సీఎంగా బాధ్యతలు స్వీకరించారు. అదే రోజు సచివాలయంలో జరిగిన తొలి క్యాబినెట్ భేటీలో రెండు కీలక నిర్ణయాలు తీసుకున్నట్లు సీఎం రేఖా గుప్తా వెల్లడించారు. అసెంబ్లీ తొలి సమావేశాల్లోనే ఆప్ సర్కారు పదేళ్ల పాలనపై కాగ్ నివేదికను ప్రవేశపెట్టాలని నిర్ణయించామన్నారు. ఆయుష్మాన్ భారత్ పథకాన్ని దిల్లీలో అమలు చేసేందుకు క్యాబినెట్ ఆమోదం తెలిపిందన్నారు. దిల్లీ ప్రజలకు ఇచ్చిన హామీలన్నింటినీ నెరవేరుస్తామని, వికసిత్ దిల్లీ కోసం ఉద్యమ తరహాలో శ్రమిస్తామన్నారు. కేజ్రీవాల్ హయాంలో నిర్మించిన శీశ్మహల్(అద్దాల మేడ)ను మ్యూజియంగా మారుస్తామన్నారు. అనంతరం దిల్లీ యమునా నదీ తీరంలోని వాసుదేవ్ ఘాట్ వద్ద నిర్వహించిన హారతి కార్యక్రమంలో కొత్త మంత్రివర్గం పాల్గొంది.
అసెంబ్లీ స్పీకర్గా విజేందర్ గుప్తా
దిల్లీ అసెంబ్లీ స్పీకర్గా విజేందర్ గుప్తా ఎంపికయ్యారు. ఎన్నికల్లో ఆయన రోహిణి నియోజకవర్గం నుంచి గెలిచారు. 2015లో నాటి ఆప్ ఎమ్మెల్యే అల్కా లాంబాపై ఎమ్మెల్యే ఓపీ శర్మ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలతో సభలో కలకలం రేగింది. సభలో చేపట్టిన ఆందోళనల్లో పాల్గొన్నారంటూ విజేందర్ గుప్తాను నాటి స్పీకర్ సస్పెండ్ చేశారు. అయితే బయటకు వెళ్లేందుకు నిరాకరించడంతో ఆయన్ను మార్షల్స్ సభ బయటకు తీసుకెళ్లారు. పదేళ్ల అనంతరం విజేందర్ గుప్తా స్పీకర్గా ఎంపికవడం విశేషం.
మహిళా మోర్చా సంబురాలు
దిల్లీ ముఖ్యమంత్రిగా రేఖా గుప్తా బాధ్యతల స్వీకరణ సందర్భంగా తెలంగాణలో రాష్ట్ర మహిళా మోర్చా ఆధ్వర్యంలో సంబురాలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బిజెపి మాజీ ఎమ్మెల్సీ ఎన్. రాంచందర్ రావు గారు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బంగారు శృతి, మహిళా మోర్చా రాష్ట్ర అధ్యక్షురాలు శిల్పా రెడ్డి, జీహెచ్ఎంసీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ & కార్పొరేటర్ రాధా ధీరజ్ రెడ్డి, మహిళా మోర్చా జిల్లా అధ్యక్షులు, ఇతర నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు. భారతీయ జనతా పార్టీ మహిళా సాధికారతకు కట్టుబడి ఉందనడానికి దిల్లీ ముఖ్యమంత్రిగా రేఖా గుప్తా బాధ్యతలు స్వీకరించడం గొప్ప ఉదాహరణ అని మహిళా మోర్చా రాష్ట్ర అధ్యక్షురాలు శిల్పా రెడ్డి అన్నారు. ఒక మహిళకు సీఎంగా అవకాశం కల్పించడం ద్వారా నరేంద్ర మోదీ పాలనలో మహిళా శక్తికి ప్రాధాన్యత మరోసారి నిరూపితమైందని పేర్కొన్నారు. ఈ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీకి కృతజ్ఞతలు తెలియజేశారు. మోదీ ప్రభుత్వంలో మహిళా నాయకత్వానికి విశేష ప్రాధాన్యత ఉందని శిల్పారెడ్డి గుర్తుచేశారు. కేంద్ర కేబినెట్లో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, పౌర సరఫరాల సహాయ మంత్రి శోభా కరంద్లాజే మహిళా నాయకులు బాధ్యతలు నిర్వహించడం గొప్ప విషయంగా పేర్కొన్నారు. తెలంగాణలో భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వస్తే మహిళల అభివృద్ధికి మరిన్ని ప్రత్యేక కార్యక్రమాలు చేపడతామని శిల్పా రెడ్డి స్పష్టం చేశారు. మహిళా సాధికారత, అభివృద్ధి, శక్తివంతమైన నాయకత్వానికి బిజెపి ప్రాతినిధ్యం వహిస్తుందని తెలిపారు.
నరేంద్ర మోదీ పాలనలో మహిళా సాధికారత దిశగా అనేక కీలక నిర్ణయాలు తీసుకున్నారని శిల్పారెడ్డి వెల్లడించారు. నారీశక్తి వందన్ అధినియమం ద్వారా లోక్సభ, అసెంబ్లీల్లో 33 శాతం మహిళా రిజర్వేషన్లు కల్పించారన్నారు. 2025-26 కేంద్ర బడ్జెట్లో మహిళా శిశు అభివృద్ధి మంత్రిత్వ శాఖకు రూ.35,000 కోట్లు కేటాయించడంతో పాటు ఉజ్వల యోజన 3.0 ద్వారా మరో 1 కోటి మహిళలకు ఉచిత ఎల్పీజీ కనెక్షన్లు అందించేలా నిర్ణయం తీసుకోవడం గొప్ప విషయమని పేర్కొన్నారు. 1000 కొత్త మహిళా శక్తి కేంద్రాలు ఏర్పాటు చేసి ఉపాధి, నైపుణ్యాభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడం హర్షణీయం అని శిల్పారెడ్డి తెలిపారు.