ఎలక్ట్రానిక్స్ తయారీ రంగంలో పెరుగుతున్న భారత్ పాత్ర
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలో భారత్ ఆపిల్ ఉత్పత్తుల ఎలక్ట్రానిక్ విడిభాగాలను చైనా, వియత్నాం వంటి కీలకమైన మార్కెట్లకు ఎగుమతి చేసే దేశంగా ఆవిర్భవించింది. అంతర్జాతీయ సరఫరా వ్యవస్థలో మారుతున్న భారత్ పాత్రకు ఇది నిదర్శనం. ఎందుకంటే ఒకప్పుడు ఈ విడిభాగాల నికర దిగుమతిదారుగా ఉన్న భారత్ నేడు ఎగుమతిదారుగా మారింది. ఈ మైలురాయి భారత ఎలక్ట్రానిక్ తయారీరంగ ముఖచిత్రాన్ని మాత్రమే కాక మొత్తంగా అంతర్జాతీయ సరఫరా వ్యవస్థలో కూడా పెనుమార్పులకు దారి తీసే అవకాశం ఉంది. ఇది నిస్సందేహంగా నరేంద్ర మోదీ ప్రారంభించిన మేకిన్ ఇండియా, ఉత్పత్తి-ఆధారిత ప్రోత్సాహకాల (పీఎల్ఐ) పథకం సాధించిన విజయమనే చెప్పుకోవాలి.
ఎలక్ట్రానిక్స్ తయారీ రంగంలో పెనుమార్పులు
అనేక సంవత్సరాలుగా అంతర్జాతీయ ఎలక్ట్రానిక్స్ సరఫరా వ్యవస్థలో భారత్ పాత్ర విడిభాగాలను, ముఖ్యంగా ఆపిల్ మ్యాక్ బుక్, ఎయిర్ పాడ్లు, వాచీలు, ఐఫోన్లు, పెన్సిళ్లు వంటి ఆపిల్ ఉత్పత్తులకు విడిభాగాలను దిగుమతి చేసుకోవడానికి పరిమితమై ఉండేది. అయితే కీలకమైన భారత ప్రభుత్వ కార్యక్రమాలను విజయవంతంగా అమలు చేయడంతో భారత్ ఇప్పుడు ఈ సరఫరా వ్యవస్థలో మరింత ఉన్నత స్థాయి పాత్ర పోషిస్తోంది. ఇప్పుడు ఆపిల్ ఉత్పత్తులకు అవసరమైన విడిభాగాలు ఎగుమతి చేయడం ద్వారా తయారీ రంగంలో భారత్ తన స్థానాన్ని మరింత పటిష్టం చేసుకుంది. ఈ మార్పునకు ఒక కీలకమైన చోదక శక్తి నరేంద్ర మోదీ ప్రభుత్వం అనుసరిస్తున్న మేకిన్ ఇండియా ఉత్పత్తి ఆధారిత ప్రోత్సాహక పథకం వంటి వ్యాపార అనుకూల విధానాలు. ఈ కార్యక్రమాలు మదర్సన్ గ్రూప్, జబీల్, ఏక్వస్, టాటా ఎలక్ట్రానిక్స్ వంటి ఆపిల్కు విడిభాగాల సరఫరాదారులు స్థానికంగానే తయారీ కేంద్రాలను ఏర్పాటు చేసేందుకు అనువైన వాతావరణాన్ని సృష్టించాయి.
ఈ కంపెనీలు ఇప్పుడు ముఖ్యమైన విడిభాగాలను భారత్లోనే తయారు చేస్తున్నాయి. తద్వారా దేశంలో బలమైన ఎలక్ట్రానిక్స్ తయారీ పర్యావరణ వ్యవస్థకు పునాదులు వేశాయి. దేశంలో ఎలక్ట్రానిక్ తయారీ పరిశ్రమల అభివృద్ధి ఆపిల్ విస్తృత లక్ష్యాలకు కూడా అనుగుణంగానే ఉంది. ఎందుకంటే చైనాపై ఎక్కువగా ఆధారపడటాన్ని తగ్గించుకోవాలని ఆపిల్ ప్రయత్నిస్తోంది. ఇప్పుడు భారత్ నుంచి విడిభాగాలను పొందడం ద్వారా ఆపిల్ తన ఉత్పత్తి ప్రక్రియలో మార్పులు చేసుకోవడానికి వీలు కలగటమే కాకుండా మనదేశంలో కూడా ఆపిల్ ఉత్పత్తులకు విలువ జోడింపు జరుగుతుంది.
ఎలక్ట్రానిక్ వస్తువుల తయారీ, ఎగుమతుల వృద్ధి
అంతర్జాతీయ ఎలక్ట్రానిక్ ఎగుమతుల రంగంలో భారత్ ప్రవేశం ఆర్థికంగా కూడా దేశానికి గణనీయమైన ప్రయోజనం చేకూర్చునుంది. ఆపిల్ సరఫరాదారులు ఇప్పుడు మనదేశంలోనే విడిభాగాలను తయారు చేయడంతో భారత్ లో ఎలక్ట్రానిక్ తయారీ రంగం మరింత విస్తరించి ఉపాధి అవకాశాలు పెరిగి, విదేశీ పెట్టుబడులను ఆకర్షించే అవకాశం ఉంది. పరిశ్రమ వర్గాల అంచనాల ప్రకారం భారత్ 2013 నాటికి 35-40 బిలియన్ డాలర్ల విలువైన విడిభాగాల ఎగుమతి లక్ష్యాన్ని సాధిస్తుంది. మారుతున్న అంతర్జాతీయ భౌగోళిక, రాజకీయ పరిస్థితులకు అనుగుణంగా అంతర్జాతీయ సరఫరా వ్యవస్థల్లో వస్తున్న మార్పులకు ఎలక్ట్రానిక్ విడిభాగాల తయారీ రంగంలో పెరుగుతున్న భారత్ పాత్ర ఒక ఉదాహరణ. ఆపిల్కు కీలక సరఫరాదారుగా భారత ఎదుగుదల ఎలక్ట్రానిక్ ఉత్పత్తుల తయారీలో దాని సామర్థ్యాల వృద్ధికి నిదర్శనమే కాకుండా వ్యూహాత్మకమైన పెట్టుబడులు దేశ ఆర్థిక పర్యావరణను ఎలా మార్చి వేయగలవో, దేశ అంతర్జాతీయ స్థాయిని ఏ విధంగా పెంచగలవో కూడా నిరూపిస్తున్నాయి.
చైనా, వియత్నాం, ఇతర అంతర్జాతీయ పోటీదారులపై ప్రభావం
భారత్ నుంచి చైనా, వియత్నాంలకు ఆపిల్ విడిభాగాల ఎగుమతి రెండు దేశాలకు ఒక ముఖ్యమైన మలుపు. ఆపిల్ ప్రపంచ తయారీ కార్యకలాపాలలో మొదటి నుంచి ఈ రెండు దేశాలూ ముఖ్యమైన కేంద్రాలుగా ఉంటున్నాయి. ఆపిల్ ఉత్పత్తుల కూర్పు (అసెంబ్లింగ్)లో చాలాకాలంగా కీలకంగా ఉన్న చైనా, వియత్నాం ఇప్పుడు భారత్ నుంచి మరిన్ని విడిభాగాలను దిగుమతి చేసుకుంటాయి, ఇది వారి సరఫరా వ్యవస్థల పునర్నిర్మాణానికి దారితీస్తుంది. ఈ మార్పు సాంప్రదాయ విడిభాగాల సరఫరాదారులపై ఆధారపడటాన్ని తగ్గిస్తుంది. ఈ దేశాలలో ఆపిల్ ఉత్పత్తుల తుది ఉత్పత్తిలో భారత్ పాత్రను పెంచుతుంది. అంతేకాక, ఈ పరివర్తన తైవాన్, దక్షిణ కొరియా, జపాన్ వంటి సాంప్రదాయ తయారీ దిగ్గజాలపై పోటీ ఒత్తిడిని పెంచే అవకాశం ఉంది. ఎలక్ట్రానిక్స్ తయారీ రంగంలో చాలా కాలంగా ఆధిపత్యం చెలాయిస్తున్న ఈ దేశాలు ఇప్పుడు కీలక విడిభాగాల కీలక సరఫరాదారుగా భారత్ స్థానాన్ని బలోపేతం చేసుకోవడంతో భారత్ నుంచి గట్టి పోటీని ఎదుర్కొనే అవకాశం ఉంది.
చైనాపై ఆధారపడటాన్ని తగ్గించాలనుకుంటున్న యాపిల్
మరింత వైవిధ్యమైన, స్థితిస్థాపక సరఫరా వ్యవస్థను నిర్మించడం కోసమే కాక ఆపిల్ పెరుగుతున్న భౌగోళిక ఉద్రిక్తతలు, భౌగోళికంగా మరింత వైవిధ్యభరితమైన ఉత్పత్తి అవసరాలను దృష్టిలో ఉంచుకుని చైనాపై ఆధారపడటాన్ని తగ్గించే విస్తృత వ్యూహంలో భాగంగా భారత్ను తన సరఫరా వ్యవస్థలో భాగం చేస్తోంది. భారతదేశాన్ని తన సరఫరా గొలుసులో విలీనం చేయడం ద్వారా ఆపిల్ ఒడిదుడుకులను తట్టుకునే సామర్థ్యాన్ని సంపాదించుకోగలదు. ఒకే తయారీ కేంద్రంపై అధికంగా ఆధారపడటం వల్ల ఎదురయ్యే నష్టాలను తగ్గించుకోగలదు. ఈ వ్యూహాత్మక మార్పు ఇతర అమెరికా టెక్ కంపెనీలకు కూడా ఆదర్శంగా నిలుస్తుంది. ప్రపంచ వ్యాపార వాతావరణం అనూహ్యంగా మారుతున్నందున, ఇతర సంస్థలు ఆపిల్ మార్గాన్ని అనుసరించవచ్చు, వారి కార్యకలాపాల స్థావరాన్ని విస్తరించడం ద్వారా, భారతదేశం వంటి దేశాలలో తయారీ అవకాశాలను అన్వేషించడం ద్వారా సరఫరా వ్యవస్థల్లో ఒడిదుడుకులను తగ్గించడానికి ప్రయత్నించవచ్చు.
ప్రముఖ ఎలక్ట్రానిక్స్ ఎగుమతిదారుగా ఎదుగుతున్న భారత్
దేశీయంగా, సరఫరా వ్యవస్థలో ఈ మార్పు భారతదేశ ఎలక్ట్రానిక్స్ తయారీ పరిశ్రమకు గణనీయమైన ప్రోత్సాహాన్ని ఇస్తుందని భావిస్తున్నారు. ఈ రంగంలో పెట్టుబడులు, ఉద్యోగాల కల్పన పెరిగి ప్రపంచ వేదికపై భారత్ పాత్ర కూడా పెరుగుతుంది. దేశీయ తయారీని ప్రోత్సహించడం, బలమైన ఎగుమతి ఆధారిత పరిశ్రమను సృష్టించడంపై భారత ప్రభుత్వం దృష్టి సారించిన ఫలితం ఇది. ముఖ్యంగా మేకిన్ ఇండియా కార్యక్రమం భారత్ పెట్టుబడులను ఆకర్షించడంలో, ప్రపంచ స్థాయి ఎలక్ట్రానిక్స్ తయారీ మౌలిక సదుపాయాలను నిర్మించడంలో కీలకంగా మారింది. నికర దిగుమతిదారు నుంచి ఎలక్ట్రానిక్ విడిభాగాల ఎగుమతిదారుగా భారత్ రూపాంతరం చెందడం ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలో సాధించిన ఒక గొప్ప విజయం. ప్రభుత్వ విధానాలను మార్చడం ద్వారా, ప్రపంచ తయారీదారులను ఆకర్షించడం ద్వారా, తన సరఫరా వ్యవస్థలను వైవిధ్యపరచడం ద్వారా, భారతదేశం ప్రపంచ ఎలక్ట్రానిక్స్ మార్కెట్లో కీలక పాత్రధారిగా నిలుస్తోంది. ఈ మార్పు భారతదేశ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయడమే కాకుండా, ప్రపంచ సరఫరా వ్యవస్థలో దాని పాత్రను పునర్నిర్వచిస్తుంది, తయారీ, ఎగుమతుల రంగంలో కొత్త శకానికి తెరతీస్తోంది.

