బీహార్ ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణను అన్ని పార్టీలూ స్వాగతించాలి
బిహార్ శాసనసభ ఎన్నికలకు ముందు ఓటర్ల జాబితాల ప్రత్యేక సవరణ (ఎస్ఐఆర్)పై భారత ఎన్నికల సంఘం (ఈసీఐ) గట్టిగా నిలబడటం హర్షణీయం. ప్రతిపక్షాలు పార్లమెంటును స్తంభింపజేస్తూ, ఎస్ఐఆర్ రాజకీయ ప్రేరేపితమని, లక్షల మంది ఓటర్ల ఓటు హక్కును హరించడానికే ఉద్దేశించినదని ఆరోపిస్తున్నాయి. ఎన్నికలను బహిష్కరిస్తామని కూడా అవి బెదిరిస్తున్నాయి. ఎన్నికల సంఘం ఒక రాజ్యాంగబద్ధ సంస్థ, దీనికి స్వయంప్రతిపత్తి గల అధికారాలు, బాధ్యతలు ఉన్నాయి. దాని చర్యలను విమర్శించినవారు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. వారు ఎన్నికల సంఘానికే ఫిర్యాదులు చేసి ఉండవలసింది. సుప్రీంకోర్టు కొన్ని ఆందోళనలను వ్యక్తం చేసి, ఈసీఐ నుంచి వివరణలు కోరింది. కానీ పిటిషన్ దాఖలు చేసిన స్వచ్ఛంద సంస్థలు (ఎన్జీవోలు) డిమాండ్ చేసినట్లుగా ధృవీకరణ ప్రక్రియను నిలిపివేయడానికి నిరాకరించింది. ఎన్నికల సంఘం రాజకీయ బెదిరింపులకు లొంగకుండా, వారి విమర్శలకు గట్టిగా స్పందించింది. “ఈ విషయాలకు భయపడి మరణించిన ఓటర్లు, శాశ్వతంగా వలస వెళ్ళిన ఓటర్లు, లేదా రెండు చోట్ల నమోదైన వారు, నకిలీ ఓటర్లు లేదా విదేశీ ఓటర్ల పేరుతో కొందరు నకిలీ ఓట్లు వేయడానికి మార్గం సుగమం చేయాలా?” అని ప్రశ్నించింది.
స్వాతంత్ర్యం వచ్చిన సమయంలో భారతదేశం సార్వత్రిక వయోజన ఓటు హక్కును ఎంచుకుంది, ఇది పాశ్చాత్య దేశాలలో కూడా అంత సాధారణం కాదు. అమెరికాలో 1965లో ఓటింగ్ హక్కుల చట్టం ద్వారా మాత్రమే దేశంలో పౌరులందరికీ ఓటు హక్కు లభించింది. బ్రిటన్లో 1928 నాటి ప్రజల ప్రాతినిధ్య (సమాన ఓటు హక్కు) చట్టం ద్వారా సార్వజనీన ఓటు హక్కు అమల్లోకి వచ్చింది. భారతదేశం నిర్ణయం గురించి తెలుసుకున్న బ్రిటన్ అప్పటి ప్రధానమంత్రి క్లెమెంట్ అట్లీ, జవహర్లాల్ నెహ్రూకు ఈ హెచ్చరిక చేయడం సముచితమని భావించారు. “ఆసియా రిపబ్లిక్లు తక్కువ, అవి కూడా ఇటీవలే ఆవిర్భవించాయి. వాటి పనితీరు అంత ప్రోత్సాహకరంగా లేదు. అవి నియంతృత్వాలు లేదా కులీన పాలనలుగా మారే అవకాశం ఉంది.” కానీ భారత నాయకత్వం 1928లో నెహ్రూ నివేదికను రూపొందించేటప్పుడు, 21 సంవత్సరాలు లేదా అంతకంటే ఎక్కువ వయస్సు ఉన్న ప్రతి అర్హత కలిగిన పౌరుడికి ఓటు హక్కు ఉంటుందని నిర్ణయించింది. డాక్టర్ బీ.ఆర్. అంబేద్కర్ ఇది ప్రాథమిక హక్కు కావాలని పట్టుబట్టారు. అయితే రాజ్యాంగ సభ వివేచనతో దీనిని రాజ్యాంగంలోని మూడవ భాగం కింద ప్రాథమిక హక్కుగా కాకుండా, అధికరణం 326 కింద రాజ్యాంగ హక్కుగా చేర్చాలని నిర్ణయించింది. ఈ వ్యత్యాసాన్ని గుర్తుంచుకోవడం ముఖ్యం, ఎందుకంటే ప్రత్యేక సవరణ (ఎస్ఐఆర్) కింద తమ పౌరసత్వాన్ని నిరూపించుకోవలసిన బాధ్యత పౌరులపైన మోపడంపై చాలా మాట్లాడుతున్నారు.
ఓటు హక్కు రాజ్యాంగ హక్కు కావడంతో, నిర్దిష్ట వ్యక్తి అర్హత ఎప్పటికప్పుడు పరిశీలనకు లోబడి ఉంటుంది. వాస్తవానికి, ప్రజా ప్రాతినిధ్య చట్టం ఓటు హక్కుకు సంబంధించి అనేక అనర్హతలను స్పష్టంగా నిర్దేశిస్తుంది. వాటిలో పౌరసత్వం లేకపోవడం, మతిస్థిమితం లేకపోవడం, కొన్ని నేరాలకు శిక్షలు, నివాసం లేకపోవడం, జైలులో ఉండటం వంటివి ఉన్నాయి. ఈ నిబంధనల అమలులో భాగంగానే ఎన్నికల సంఘం ఈ ఎస్ఐఆర్ను చేపట్టింది. వేల మంది బ్లాక్ స్థాయి అధికారులు (బిఎల్వోలు), ఇతర అధికారుల సహాయంతో ఇంటింటి తనిఖీ మొదటి దశను పూర్తి చేసింది. విమర్శలను పక్కనపెట్టి, ఈ ప్రక్రియ ద్వారా 99 శాతం మంది ఓటర్లు కవర్ అయ్యారని, 21.6 లక్షల మంది మరణించిన ఓటర్లను గుర్తించడానికి ఇది సహాయపడిందని ఈసీ ప్రకటించింది. మరో 31.5 లక్షల మంది మంది శాశ్వతంగా వలస వెళ్ళినట్లు వెల్లడైంది. అయితే ఒక లక్ష మంది ఆచూకీ తెలియలేదు. ఈ సంఖ్య బిహార్లోని మొత్తం 7.21 కోట్ల ఓటర్లలో సుమారు 8 శాతం. మరణించిన లేదా వలస వెళ్ళిన వారి గురించి ఎటువంటి వివాదం ఉండకూడదు. 1 శాతం కంటే తక్కువ మంది ఓటర్లు తమ దరఖాస్తులను సమర్పించడంలో విఫలమయ్యారు. దీనిపై రాజకీయ పార్టీలు, ఈసీఐ రెండూ మరింత దృష్టి పెట్టాలి.
ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియ ఇంతటితో ముగిసిపోదు. సవరించిన ఓటర్ల జాబితాలను ఆగస్టు 1 నాటికి 12 నమోదిత పార్టీలకు సరఫరా చేస్తారు. బీఎల్ఓలు “అసాధ్యమైన గడువుల” కారణంగా తమ పనిని చేయలేదని సుప్రీంకోర్టులో పిటిషనర్లు వాదించినందున, తొలగింపులను సవాలు చేయడానికి పార్టీలకు ఒక నెల సమయం ఉంటుంది. బీఎల్ఓలకు ఈ పనిని పూర్తి చేయడానికి ఒక నెల సమయం ఉంది, ఈ సమయంలో వారు 300-400 గృహాలను సందర్శించాల్సి ఉంటుంది. అంటే ఒక పనిదినం నాడు 15 కంటే తక్కువ ఇళ్లను సందర్శించాలి. ఇది పిటిషనర్లు “అసాధ్యం” అని భావిస్తున్నారు. పేద, దిగువ మధ్యతరగతి వర్గాలకు చెందిన ఆ బీఎల్ఓలు ఓటర్లను వేధిస్తున్నారని, మోసం చేస్తున్నారని, లంచాలు కూడా అడుగుతున్నారని వారు ఆరోపించారు.
ఎన్నికల సంస్కరణలు ఎప్పుడూ సులువు కాదు. బూత్ ల స్వాధీనం, దొంగ ఓట్లు, నకిలీ ఓటింగ్ వంటి వాటిని పరిష్కరించడానికి నాలుగు దశాబ్దాలు పట్టింది. టీ.ఎన్. శేషన్ వంటి అధికారి స్వయంగా బూత్ ల స్వాధీనాన్ని, దొంగ ఓట్లను, ఒకరి ఓట్లు మరొకరు వేయడాన్ని ప్రత్యక్షంగా వీక్షించాల్సి వచ్చింది. ధైర్యవంతుడైన శేషన్ ఓటర్ల జాబితాలను ప్రక్షాళన చేయడానికి, ఓటర్ గుర్తింపు కార్డులను ప్రవేశపెట్టడానికి, నాయకులు ఎన్నికల నియమావళిని నిక్కచ్చిగా పాటించేలా చేయడానికి ప్రయత్నించినప్పుడు లెక్కలేనన్ని సవాళ్లను ఎదుర్కొన్నారు. అప్పటి వరకు ఎన్నికల నిబంధనలు వారికి ఒక కాగితపు ముక్కగానే ఉండేవి. పార్లమెంటులో కనీసం రెండు సార్లు ఆయనను అభిశంసించడానికి ప్రయత్నాలు జరిగాయి. శేషన్ అధికారాన్ని తగ్గించడానికి సమాన అధికారాలు కలిగిన ఇద్దరు అదనపు ఎన్నికల కమిషనర్లను చేర్చారు. తద్వారా కమిషన్ మూడు సభ్యుల సంస్థగా మారింది. శేషన్ పట్టుదలతో పోరాడి సుప్రీంకోర్టుకు వెళ్లారు. “రాజకీయ నాయకులను నేను అల్పాహారంగా తీసుకుంటాను” అని ఆయన ఒకసారి వ్యాఖ్యానించారు. శేషన్ కృషి కీలకమైన సంస్కరణలకు దారితీసింది. మరీ ముఖ్యంగా, అప్పటివరకు రాజకీయ వర్గాల దృష్టిలో కాగితపు పులిగా ఉన్న కమిషన్కు అవి పదును పెట్టాయి. తర్వాతి ఎన్నికల కమిషనర్లు ఎన్నికలను నిష్పక్షపాతంగా, పారదర్శకంగా నిర్వహించడంలో కమిషన్ మహోన్నతమైన, స్వతంత్ర పాత్రను సమర్థంగా కొనసాగించారు. గత కొన్ని దశాబ్దాలుగా, భారతదేశ ఎన్నికల వ్యవస్థ 96 కోట్ల మంది ఓటర్లు, 10 లక్షల పోలింగ్ స్టేషన్లతో భారీ స్థాయిలో ఉన్నప్పటికీ, అత్యంత విజయవంతమైన, సమర్థమైన వ్యవస్థలలో ఒకటిగా తనను తాను నిరూపించుకుంది. అనేక దేశాలు భారత ఎన్నికల సంఘాన్ని ఆదర్శంగా తీసుకుంటున్నాయి. ఓటర్ల జాబితాలను ఎప్పటికప్పుడు సవరించడం ఏ దేశంలోనైనా తప్పనిసరి. మన దేశంలో పెద్ద ఎత్తున వలసలు జరుగుతున్న దృష్ట్యా, బిహార్తో ప్రారంభించి, దేశవ్యాప్తంగా ఓటర్ల జాబితాలను క్షుణ్ణంగా సవరించాలన్న కమిషన్ నిర్ణయాన్ని అన్ని పార్టీలూ స్వాగతించాలి.
రాం మాధవ్,
బిజెపి సీనియర్ నాయకులు

