జిల్లాల్లో రైతు సత్యాగ్రహం
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ ‘ఆరు గ్యారెంటీలు’ ప్రకటించి, అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లో అమలు చేస్తామని చేయలేదు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి 100 రోజులు దాటినా రైతులకు రుణమాఫీ చేయలేదు. కరవుతో పంటలు నష్టపోతున్న రైతులను ఆదుకోవడానికి ఎలాంటి చర్యలు చేపట్టడం లేదు. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో రైతాంగాన్ని ఆదుకునేందుకు బిజెపి తెలంగాణ శాఖ ఏప్రిల్ 5న “రైతు సత్యాగ్రహం” పేరుతో జిల్లా కేంద్రాల్లో నిరసన కార్యక్రమాన్ని చేపట్టింది. నారాయణపేటలో బిజెపి ఉపాధ్యక్షురాలు డి.కె. అరుణ, సంగారెడ్డిలో బిజెపి ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు డా. కె. లక్ష్మణ్, నిర్మల్ లో బిజెఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి, నిజామాబాద్ లో ఎంపీ ధర్మపురి అర్వింద్, బిజెపి ఎమ్మెల్యేలు, ఎంపీ అభ్యర్థులు, రాష్ట్ర నాయకులు వేరువేరు జిల్లాల్లో నిర్వహించిన ఈ దీక్షలో పాల్గొన్నారు. వడ్లకు క్వింటాలు రూ.500 చొప్పున బోనస్ వెంటనే చెల్లించాలని, రూ. 2 లక్షలలోపు రైతుల బ్యాంకు రుణాలు వెంటనే మాఫీ చేయాలని, కరవు వల్ల పంటలు నష్టపోయిన రైతులకు ఎకరాకు రూ.25 వేలు చొప్పున నష్టపరిహారం వెంటనే చెల్లించాలని, రైతు కూలీలకు రూ.12 వేల చొప్పున వారి బ్యాంకు ఖాతాలో వెంటనే జమ చేయాలని, రైతు భరోసా కింద ఎకరాకు రూ.15 వేలు చొప్పున రైతుల బ్యాంకు ఖాతాలో వెంటనే జమచేయాలని డిమాండ్ చేశారు.

