విద్వేష భావజాలానికి కాంగ్రెస్, కమ్యూనిస్టుల అండ
జనవరి 11న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సోమనాథ్ ఆలయ చరిత్రను స్మరిస్తూ, “సోమనాథ్ మహాదేవ్ ఆలయంపై ఎగిరే పతాకం భారతదేశ శక్తిని, సామర్థ్యాన్ని ప్రపంచానికి చాటిచెబుతోంది,” అని అన్నారు. కాలచక్రంలో “ఆ మతోన్మాద దురాక్రమణదారులు నేడు చరిత్ర పుటలకే పరిమితమయ్యారు, కానీ సోమనాథ్ ఆలయం నేటికీ సగర్వంగా నిలిచి ఉంది,” అని ఆయన పేర్కొన్నారు. భారతదేశాన్ని ‘మెకాలే’ మనస్తత్వం నుండి పూర్తిగా విముక్తి చేయాలన్న సంకల్పాన్ని ఆయన ప్రకటించారు. అయితే మన దేశంలో పాతుకుపోయిన మేధో స్తబ్దతకు కేవలం థామస్ మెకాలే వారసత్వం మాత్రమే కారణం కాదు; మన రాజకీయ, విద్యా, సామాజిక రంగాలను ఏలుతున్న కార్ల్ మార్క్స్ భావజాల వారసుల పాత్ర కూడా అంతే ఉంది. “సోమనాథ్ స్వాభిమాన్ పర్వ్” సందర్భంగా ప్రధాని “మతోన్మాద దురాక్రమణదారులు చరిత్ర పుటలకే పరిమితమయ్యారు” అని ఆయన సరిగ్గానే చెప్పారు. కానీ బాబర్, ఔరంగజేబుల క్రూరమైన మనస్తత్వం వారి భౌతిక నిష్క్రమణతో అంతమైందా? లేక ఆ విద్వేషం అనే వైరస్ కేవలం రూపాంతరం చెందిందా? దీనికి సమాధానం ప్రస్తుత ప్రపంచ వాస్తవాల్లో కనిపిస్తుంది.
విద్వేష భావజాలం-ఒక చేదు నిజం
1993 ముంబై పేలుళ్లు, 2001లో ఆఫ్ఘనిస్తాన్లోని బామియన్ బుద్ధ విగ్రహాల ధ్వంసం, అమెరికాపై జరిగిన 9/11 దాడులు, భారత పార్లమెంటుపై జిహాదీ దాడి, 26/11 ముంబై మారణకాండ – ఇవన్నీ ఇస్లామిక్ మతసిద్ధాంతాల ప్రేరణతో మానవాళికి వ్యతిరేకంగా జరిగిన నేరాల సుదీర్ఘ జాబితాలో కొన్ని మాత్రమే. ఇక ఇటీవల జరిగిన సంఘటనలు — 2024 జర్మనీలోని మాగ్డేబర్గ్ లో దాడి, 2025 అక్టోబర్లో బ్రిటన్ ఉగ్రవాద ఘటన (జిహాద్ అల్-షామీ), ఏప్రిల్ 2025 పహల్గామ్ హత్యలు, నవంబర్ 2025 ఢిల్లీ పేలుడు, డిసెంబర్ 2025న ఆస్ట్రేలియాలోని సిడ్నీలో ఊచకోత — ఇవన్నీ ఈ ప్రమాదకరమైన భావజాలం ఇంకా అంతం కాలేదని నిరూపిస్తున్నాయి. ఇస్లాం పేరుతో ఈ విచక్షణారహిత హింస ఎందుకు? ఇస్లామిక్ దురాక్రమణదారులు భారతదేశంపై పదేపదే దాడులు చేసి, సోమనాథ్ వంటి అద్భుతమైన ఆలయాలను ఎందుకు ధ్వంసం చేశారు? ఈ దాడులకు మతపరమైన కోణం లేదని, కేవలం ఆలయాల్లోని సంపద కోసమే జరిగాయని వామపక్ష చరిత్రకారులు మనల్ని నమ్మించే ప్రయత్నం చేశారు. కానీ తుజుక్-ఎ-తైమూరీలో తైమూర్ (1398లో భారత్పై దాడి చేసినవాడు) ఇలా పేర్కొన్నాడు: “నేను హిందుస్థాన్కు రావడంలో ప్రధానంగా రెండు ఉద్దేశాలు ఉన్నాయి: ఒకటి, మహమ్మదీయ మతానికి శత్రువులైన కాఫిర్లపై యుద్ధం చేయడం (జిహాద్), తద్వారా పరలోకంలో పుణ్యం పొందడం. రెండోది, వారి సంపదను లూటీ చేయడం. మతం కోసం పోరాడే ముస్లింలకు యుద్ధంలో లూటీ చేసిన ధనం తల్లి పాలు అంత పవిత్రమైనది.”
చరిత్రకారుడు అబ్రహం ఎరాలీ (ది ఏజ్ ఆఫ్ రాత్) ప్రకారం: “మహమూద్ గజనీ తన పట్టాభిషేక సమయంలోనే భారతదేశంలోని విగ్రహారాధకులపై ఏటా జిహాద్ చేస్తానని ప్రతిజ్ఞ చేశాడు. అతని 32 ఏళ్ల పాలనలో డజనుకు పైగా దాడులు చేశాడు. అతని ఉద్దేశ్యాలు రెండు – అన్యమతస్థులను ఊచకోత కోయడం, సంపదను దోచుకోవడం. ఇవి ఒకదానితో ఒకటి ముడిపడి ఉన్న లక్ష్యాలు.” గజనీ మహమూద్ ఒకసారి హిందూ రాజు ఇచ్చిన భారీ పరిహారాన్ని తిరస్కరిస్తూ – “అన్యమతస్థుల ప్రార్థనా స్థలాలను ధ్వంసం చేసేవారికి తీర్పు దినాన గొప్ప ప్రతిఫలం లభిస్తుందని ముస్లిం మతం చెబుతోంది, నేను హిందుస్థాన్లోని విగ్రహాలను పూర్తిగా తొలగించాలనుకుంటున్నాను,” అని అన్నాడు.
చరిత్రకు బందీ అయిన వర్తమానం
నేటి దేశ జనాభాలో హిందువులు, ముస్లింలు కలిపి దాదాపు 95 శాతం ఉన్నారు. భారత్-పాక్ పొరుగు దేశాలు. ఇద్దరి మూలాలు, జాతి ఒక్కటే. వీరు కలిసి శాంతియుతంగా జీవించడం తప్ప మరో మార్గం లేదు. కానీ, చరిత్ర ఇచ్చిన చేదు జ్ఞాపకాలు వారిని విడదీస్తున్నాయి. భారత్ లోని స్వదేశీ మతాల అనుచరులు ఇస్లాంను ఒక మతంగా కంటే, దాడుల ద్వారా వచ్చిన ఒక రాజకీయ-సైనిక శక్తిగా చూశారు. దాదాపు ఎనిమిది శతాబ్దాల పాటు ఇస్లామిక్ రాజవంశాల పాలన సాగింది. వారి అధికారం ‘కాఫిర్’, ‘కుఫ్ర్’ వంటి మతపరమైన భావనలపై ఆధారపడి ఉండేది. ఆలయాల ధ్వంసం, మతం మారని వారిని చంపడం, జిజియా పన్ను, ముస్లిమేతరులపై వేధింపులు అప్పట్లో ప్రభుత్వ విధానంలో భాగంగా ఉండేవి.
హిందూ నాగరికత వైవిధ్యమైనది, అందరినీ కలుపుకొనిపోయేది. దానికి భిన్నంగా ఇస్లాం సిద్ధాంతం మానవాళిని ‘విశ్వాసులు’, ‘అవిశ్వాసులు’గా విభజిస్తుంది. చాలా మంది ముస్లింలు వ్యక్తిగతంగా శాంతియుతంగా ఉన్నప్పటికీ, ఇతర మతాలను సమానంగా గౌరవించడం వారి మతపరమైన నిబంధనలకు విరుద్ధం కావడంతో సహజీవనం కష్టతరమవుతోంది. ఈ సిద్ధాంతపరమైన వైరుధ్యం ఒక లోతైన అగాధాన్ని సృష్టించింది: హిందువులు తాము అనుభవించిన కష్టాలను, అవమానాలను గుర్తు చేసుకుంటుంటే, చాలా మంది ముస్లింలు ఆ అల్లకల్లోలమైన గతం గురించి గర్వంగా భావిస్తూ, దాష్టీకంగా వ్యవహరిస్తున్నారు. చరిత్రపై సరైన అవగాహన లేనంత వరకు ఈ సహజీవనం అసాధ్యం.
సయోధ్య ఎక్కడ?
భారత్ లో సామరస్యం పరస్పర అవగాహన కంటే, ఒక వైపు నుంచి ఉండే సహనంలా మారిపోయింది. గతాన్ని మనం మార్చలేం, కానీ ఆ అన్యాయాలను ఎందుకు ఉత్సవాలుగా జరుపుకోవాలి? గతం అనేది వర్తమానాన్ని, భవిష్యత్తును నాశనం చేయకూడదు. ప్రపంచవ్యాప్తంగా చాలా దేశాలు తమ చారిత్రక విభేదాలను పరిష్కరించుకున్నాయి, కానీ భారత్ ఇంకా ఆ దిశగా అడుగులు వేయలేదు. మన దేశంలో హిందూ-ముస్లింల మధ్య సయోధ్యకు అడ్డుపడుతున్నది ఏమిటి? ఐరోపాలో క్రైస్తవం సంస్కరణలను తెచ్చి లౌకికవాదాన్ని స్వీకరించింది. హిందూ మతం కూడా అదే విధంగా పరిణామం చెందింది. కానీ ఇస్లాం ఇంకా అటువంటి తాత్విక, చారిత్రక పరివర్తనకు గురికాలేదు. గజనీ, ఘోరీ, బాబర్, ఔరంగజేబు వంటి వారిని గొప్పగా చూపే ప్రయత్నాలు ఇంకా కొనసాగుతున్నాయి. 1947 నాటి దేశ విభజన ఈ సమస్యను పరిష్కరిస్తుందని భావించారు. కానీ అది జరగలేదు. పాకిస్తాన్ ఇస్లామిక్ దేశంగా మారింది, కానీ ‘ద్విజాతి సిద్ధాంతం’ అనే విభజన మనస్తత్వం భారత్లో ఇంకా సజీవంగానే ఉంది. వామపక్షాలు, కాంగ్రెస్ వంటి పార్టీలు ముస్లింలను కేవలం ఓటు బ్యాంకుగా వాడుకుంటూ వారిలోని మతోన్మాదాన్ని ప్రోత్సహిస్తున్నాయి. సయోధ్య ప్రక్రియ ఎక్కడ మొదలవ్వాలి? విద్వేషాన్ని పెంచే సిద్ధాంతపరమైన మూలాలపై నిజాయితీతో కూడిన పరిశీలన జరగాలి. అబద్ధపు కథనాలను, చారిత్రక వక్రీకరణలను తొలగించాలి. చరిత్రలోని చేదు నిజాలను అంగీకరించినప్పుడే ప్రశాంతమైన భవిష్యత్తు సాధ్యమవుతుంది.
బల్బీర్ కె. పుంజ్,
ఐఐఎంసీ మాజీ ఛైర్మన్

