గ్రామీణ వికాసం – అన్నదాతకు ప్రోత్సాహం
గ్రామీణాభివృద్ధి శాఖకు కేటాయింపులను ప్రస్తుత సంవత్సరం కంటే 3.5% పెంచి రూ.1,94,368.81 కోట్లు చేశారు. గ్రామీణ సడక్ యోజనకు ప్రస్తుత సంవత్సరం మాదిరిగానే రూ.19,000 కోట్లు కేటాయించారు. ఎంజీ నరేగా స్థానంలో తీసుకువచ్చిన వీబీ జీ రామ్ జీకి రూ.95,692 కోట్లు కేటాయించారు. గ్రామీణ వికాసానికి, రైతుల ప్రోత్సాహానికి పెద్దపీట వేసేలా వివిధ ప్రతిపాదనల్ని కేంద్ర బడ్జెట్లో ఆవిష్కరించారు. కేవలం వ్యవసాయంపైనే కాకుండా చేపల పెంపకం, పాడి పరిశ్రమ వంటి ఇతర రంగాల ద్వారా కూడా ఆదాయం వచ్చేలా రాయితీలు ప్రకటించారు. వ్యవసాయం, అనుబంధ రంగాలకు రూ.1,62,671 కోట్ల కేటాయింపును ప్రతిపాదించారు. ఇది 2025-26 సంవత్సరానికి సవరించిన అంచనాల మొత్తం రూ.1,51,853 కోట్ల కంటే 7.12% ఎక్కువ.
సముద్రంలో ‘ప్రత్యేక ఆర్థిక మండలి’ (EEZ – Exclusive Economic Zone) పరిధిలోని జలాల్లో భారతదేశ నౌకలు పట్టే మత్స్య సంపదపై ఎలాంటి సుంకం ఉండదు. ఈ మత్స్య సంపదను విదేశీ ఓడరేవులకు చేరిస్తే మాత్రం ఇది అక్కడికి ఎగుమతి అయిన సరకుగా పరిగణిస్తారు. మన ప్రాదేశిక జలాలకు వెలుపల పట్టే మత్స్య సంపదకు ఆర్థిక విలువను భారతీయ మత్స్యకారులు పొందేలా ఈ ఏర్పాటు చేశారు. ఇది దుర్వినియోగం కాకుండా తగిన రక్షణ చర్యలు ప్రతిపాదించారు. సముద్ర ఆహార ఉత్పత్తుల్ని ఎగుమతి చేసేవారికి ‘సుంకాల్లేని దిగుమతుల విలువ’ను ప్రభుత్వం పెంచనుంది. మునుపటి ఆర్థిక సంవత్సరంలో చేసిన ఎగుమతుల్లో ఒక శాతం వరకు ఉన్నదాన్ని ఇప్పుడు 3% చేస్తున్నారు. దేశీయంగా మత్స్య పరిశ్రమకు ఊతమివ్వడానికి 500 జలాశయాలను సమగ్రంగా అభివృద్ధి చేస్తారు. అమృత్ సరోవర్లను తీర్చిదిద్దుతారు. అంకురాలు, మహిళా గ్రూపులు, చేపలసాగు రైతుల ఉత్పత్తుల సంస్థల ద్వారా విలువ పెంచే గొలుసుకట్టు వ్యవస్థను తీర ప్రాంతాల్లో బలోపేతం చేస్తారు.
పేద, బలహీనవర్గాలు సహా రైతుల ఆదాయంలో 16% వరకు పశుసంపద ద్వారా వస్తోంది. అందువల్ల మరో 20 వేలమంది పశుసంవర్థక వృత్తి నిపుణులు అందుబాటులోకి వచ్చేలా రుణ ఆధారిత పెట్టుబడి రాయితీ పథకం కొత్తగా అమలు చేస్తారు. ఆ మేరకు వెటర్నరీ కళాశాలలు, పశువైద్య ఆసుపత్రులు, రోగ నిర్ధారణ కేంద్రాలు, సంతానోత్పత్తి సదుపాయాలు ప్రైవేటు రంగంలో వచ్చేందుకు పథకం తోడ్పాటు అందిస్తుంది.
- కొబ్బరి, గంధం, జీడి, బాదం, అక్రోటు, కోకో సాగుపై దృష్టి కేంద్రీకరిస్తారు. తద్వారా ఉపాధి అవకాశాలు పెంచుతారు. పాత, దిగుబడినివ్వని కొబ్బరి చెట్ల స్థానే కొత్తరకం కొబ్బరి మొక్కల్ని నాటే పథకాన్ని చేపడతారు. గంధం చెట్ల పెంపకంలో మునుపటి వైభవాన్ని తీసుకురావాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.
- బీడీల తయారీకి వాడే తునికాకుపై ‘మూలం వద్ద పన్ను మినహాయింపు’ (టీసీఎస్)ను 2 శాతానికి తగ్గిస్తారు.
పశువుల దాణా, పత్తిగింజల సరఫరాలో ఉన్న సహకార సొసైటీలకు పన్ను రాయితీలు లభించనున్నాయి. ప్రస్తుతం పాలు, నూనెగింజలు, పళ్లు, కూరగాయలు వంటివి సరఫరా చేసే ప్రాథమిక సహకార సొసైటీలకే ఇలాంటి మినహాయింపులు ఉన్నాయి.
- అంతర్ సహకార సొసైటీ డివిడెండ్ ఆదాయంపై కొత్త ఐటీ చట్టం కింద పన్ను మినహాయింపు లభిస్తుంది.
- గుర్తింపు పొందిన జాతీయ సహకార సమాఖ్య ఈ ఏడాది జనవరి 31లోగా కంపెనీల్లో పెట్టే పెట్టుబడులపై వచ్చే ఆదాయానికి మూడేళ్లపాటు పన్ను మినహాయింపు ఉంటుంది. సభ్య సొసైటీలకు ఇచ్చే డివిడెండ్లకు ఇది వర్తిస్తుంది.
- సహకార సొసైటీలకు ఉన్న ఆదాయపు పన్ను శ్లాబుల్లో మార్పు లేదు.
ఆకాంక్షిత జిల్లాల స్ఫూర్తితో రాష్ట్రాలతో కలిసి ‘ప్రధానమంత్రి ధన ధాన్య కృషి యోజన’ను చేపట్టనున్నారు. తక్కువ దిగుబడులు వస్తున్న 100 జిల్లాల్లో ఇప్పుడున్న పథకాలను, ప్రత్యేక చర్యల్ని కలిపి దీనిని అమలు చేస్తారు. ఉత్పత్తి, పంటల వైవిధ్యం, కోతల తర్వాత నిల్వ, సాగునీటి సదుపాయాలు, రుణ పరపతి పెంచడం దీని లక్ష్యం. దాదాపు 1.7 కోట్ల మందికి ఇది ఉపయోగపడనుంది. వ్యవసాయానికి అండదండలిచ్చి, వలసల అవసరం తగ్గేలా చూస్తారు.
- పప్పు ధాన్యాలకు, ముఖ్యంగా- కందిపప్పు, మినపపప్పు, ఎర్ర కందిపప్పులపై ప్రత్యేక దృష్టి సారిస్తూ ఆరేళ్ల స్వయంసమృద్ధి సాధించడానికి ‘పప్పుల్లో ఆత్మనిర్భరత’ మిషన్ను ప్రారంభిస్తారు.
- ఆదాయం పెరగడంతో కూరగాయలు, పండ్లు, శ్రీ-వరి వినియోగం కూడా పెరుగుతోంది. వీటి ఉత్పత్తిని పెంచే సమగ్ర కార్యక్రమం చేపడతారు.
- బిహార్లో మఖానా బోర్డు ఏర్పాటు
- పత్తిరైతుల కోసం ప్రత్యేక మిషన్
- 7.7 కోట్ల మంది రైతులు, మత్స్యకారులు, పాడి రైతులకు కిసాన్ క్రెడిట్ కార్డుల ద్వారా ఇచ్చే స్వల్పకాలిక రుణాలు రూ.3 లక్షల నుంచి రూ.5 లక్షలకు పెంపు
రైతులకు కావాల్సిన సలహాలను వారివారి భాషల్లో ఇచ్చేందుకు వీలుగా ఏఐ ఆధారిత ‘భారత్-విస్తార్’ సాధనం అందుబాటులోకి వస్తుంది. ఉత్పాదకత పెంచడానికి, రైతులు మెరుగైన నిర్ణయాలు తీసుకునేందుకు ఇది ఉపయోగపడుతుంది.

