భారత్ను కాపాడిన మోదీ ప్రభుత్వ దీర్ఘకాలిక వ్యూహం
భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు, కఠినమైన ఆర్థిక ఆంక్షలు, అంతర్జాతీయ సరఫరా గొలుసులో ఆటంకాలు పెరుగుతున్న నేటి కాలంలో దేశ ఇంధన భద్రతను కాపాడుకుంటూనే దౌత్యపరమైన సమతుల్యతను పాటించడం ఏ ప్రభుత్వానికైనా ఒక పెద్ద సవాలు. కానీ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో భారతదేశం ఈ విషయంలో అత్యంత జాగ్రత్తగా, ఆచరణాత్మకమైన మార్గంలో చాకచక్యంగా పయనిస్తోంది. గత కొన్నేళ్లుగా చమురు కొనుగోలు, విదేశీ విధానాల విషయంలో మోదీ ప్రభుత్వం అనుసరిస్తున్న తీరు, ఒక ప్రధాన అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థ తన జాతీయ ప్రయోజనాలను కాపాడుకుంటూనే, పరస్పర విరుద్ధ ప్రయోజనాలు కలిగిన అంతర్జాతీయ శక్తులతో ఎలా నిర్మాణాత్మక సంబంధాలను కొనసాగించవచ్చో నిరూపిస్తోంది.
భారతదేశం ప్రపంచంలోనే మూడవ అతిపెద్ద చమురు వినియోగదారుగా ఉంది. తన ముడి చమురు అవసరాలలో 80 శాతానికి పైగా దిగుమతులపైనే ఆధారపడుతోంది. దీనివల్ల అంతర్జాతీయ సరఫరాలో వచ్చే అస్థిరతకు, ధరల హెచ్చుతగ్గులకు భారత్ ప్రభావితమయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది. రష్యా-ఉక్రెయిన్ యుద్ధం, తదనంతరం రష్యాపై యూరోపియన్ యూనియన్, అమెరికా విధించిన ఆంక్షలు ప్రపంచ ఇంధన విపణిలో అనూహ్య మార్పులకు దారితీశాయి. అదే సమయంలో మధ్యప్రాచ్యంలో నెలకొన్న ఉద్రిక్తతలు, చమురు ఉత్పత్తి దేశాల్లో అప్పుడప్పుడు తలెత్తే అస్థిరత ఈ సంక్లిష్టతను మరింత పెంచాయి. ఈ సవాళ్లు ఎదురైనప్పటికీ మోదీ ప్రభుత్వం వాస్తవిక దృక్పథం, వైవిధ్యీకరణ, దౌత్యనీతిపై ఆధారపడిన వ్యూహాన్ని అనుసరించింది. ఏదో ఒక భౌగోళిక రాజకీయ కూటమికి మాత్రమే పరిమితం కాకుండా, విశ్లేషకులు అభివర్ణించే ‘బహుళ పక్ష అనుసంధాన’ విధానాన్ని భారత్ అవలంబించింది. ఈ విధానం వల్ల భారత్ ఒకవైపు పాశ్చాత్య ప్రజాస్వామ్య దేశాలతో బలమైన భాగస్వామ్యాన్ని కొనసాగిస్తూనే మరోవైపు ఇతర ప్రధాన ఇంధన సరఫరాదారులతో చురుగ్గా వ్యవహరించగలుగుతోంది.
ఈ ఆచరణాత్మక వ్యూహానికి అత్యంత కీలకమైన ఉదాహరణ, ఉక్రెయిన్ వివాదం ప్రారంభమైన తర్వాత రష్యా నుంచి ముడి చమురు దిగుమతులను పెంచుకోవాలని భారత్ తీసుకున్న నిర్ణయం. పాశ్చాత్య దేశాలు రష్యన్ చమురుపై ఆంక్షలు, ధరల పరిమితులను విధించినప్పుడు చాలా మంది కొనుగోలుదారులు వెనకడుగు వేశారు. అయితే, భారత్ ఈ అవకాశాన్ని ఉపయోగించుకుని రాయితీ ధరకు ముడి చమురును పొంది, దేశీయ మార్కెట్కు నిరంతర సరఫరా ఉండేలా చూసుకుంది. తద్వారా ప్రభుత్వం దేశీయంగా ఇంధన ధరలు భారీగా పెరగకుండా వినియోగదారులను రక్షించడమే కాకుండా, దేశ ఇంధన భద్రతను బలోపేతం చేసింది. ప్రారంభంలో విమర్శకులు ఈ చర్యను ప్రశ్నించినప్పటికీ, ప్రభుత్వం తన నిర్ణయాన్ని జాతీయ ప్రయోజనాల కోణంలోనే సమర్థించుకుంది. 140 కోట్ల మంది భారతీయులకు సరసమైన ధరకే ఇంధనాన్ని అందించడం తమ ప్రాథమిక బాధ్యతని అధికారులు స్పష్టం చేశారు. అంతేకాకుండా, ఈ కొనుగోళ్లు అంతర్జాతీయ నిబంధనలు, ధరల పరిమితి యంత్రాంగాలకు లోబడే జరిగాయని, తద్వారా ప్రపంచ నిబంధనలను ఉల్లంఘించలేదని స్పష్టం చేశారు.
రష్యాతో సంబంధాలను కొనసాగిస్తూనే, భారత్ తన సంప్రదాయ సరఫరాదారులైన మధ్యప్రాచ్య దేశాలతో ఇంధన భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేసుకుంది. సౌదీ అరేబియా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, ఇరాక్ వంటి దేశాలు ఇప్పటికీ భారత్ చమురు దిగుమతి వ్యూహంలో కీలక స్తంభాలుగా ఉన్నాయి. ఉన్నత స్థాయి దౌత్య చర్చలు, దీర్ఘకాలిక సరఫరా ఒప్పందాల ద్వారా, మోదీ ప్రభుత్వం ఈ సంబంధాలు పరస్పర ప్రయోజనకరంగా ఉండేలా చూసింది. గల్ఫ్ దేశాలతో ప్రధానమంత్రి మోదీ జరిపిన నిరంతర దౌత్యపరమైన చర్చలు ఆ ప్రాంతంలో భారత్ వ్యూహాత్మక ప్రాముఖ్యతను పెంచాయి. ఇంధన సహకారం కేవలం ముడి చమురు కొనుగోళ్లకు మాత్రమే పరిమితం కాకుండా, రిఫైనింగ్, పెట్రోకెమికల్స్, వ్యూహాత్మక నిల్వ కేంద్రాలలో పెట్టుబడుల వరకు విస్తరించింది. ఈ చర్యలు కేవలం నిరంతర సరఫరాకు హామీ ఇవ్వడమే కాకుండా, ప్రపంచ ఇంధన విలువ గొలుసులో భారత్ను ఒక ముఖ్యమైన భాగస్వామిగా నిలబెట్టాయి.
ప్రభుత్వ వ్యూహంలో మరొక ప్రధాన అంశం వైవిధ్యీకరణ. గత దశాబ్ద కాలంలో భారత్ ఆఫ్రికా, అమెరికా ఖండాల్లోని దేశాల నుంచి కూడా చమురు దిగుమతులను ప్రారంభించి తన సరఫరా వనరులను విస్తరించింది. బ్రెజిల్, గయానా, అమెరికా వంటి దేశాలు ఇప్పుడు భారత్ ఇంధన అవసరాల్లో కీలక పాత్ర పోషిస్తున్నాయి. ఈ వైవిధ్యీకరణ వల్ల ఏదైనా ఒక ప్రాంతంపై అతిగా ఆధారపడటం తగ్గి, భౌగోళిక రాజకీయ అస్థిరతలు ఏర్పడినప్పుడు తట్టుకునే శక్తి లభించింది. వ్యూహాత్మక పెట్రోలియం నిల్వలను విస్తరించడంలో కూడా భారత్ భారీగా పెట్టుబడులు పెట్టింది. ఈ భూగర్భ నిల్వ కేంద్రాలు అకస్మాత్తుగా సరఫరాలో ఆటంకాలు కలిగినప్పుడు లేదా ధరలు పెరిగినప్పుడు రక్షణ కవచంలా పనిచేస్తాయి. ఈ నిల్వ సామర్థ్యాన్ని పెంచడం ద్వారా అత్యవసర పరిస్థితులను ఎదుర్కోవడంలో, దేశీయ మార్కెట్లో స్థిరత్వాన్ని కాపాడటంలో ప్రభుత్వం తన సామర్థ్యాన్ని చాటుకుంది.
మరొక ముఖ్యమైన అంశం ఏమిటంటే భారత్ దౌత్య సమతుల్యత. ఇంధన రంగంలో రష్యాతో సంబంధాలను బలపరుచుకుంటూనే, భారత్ అమెరికా, యూరోపియన్ దేశాలతో తన వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత లోతుగా పెంచుకుంది. రక్షణ, సాంకేతికత, వాణిజ్య రంగాలలో సహకారం నిరంతరం విస్తరిస్తూనే ఉంది. ఇది భారతదేశ ఇంధన నిర్ణయాలు ఇతర దౌత్య సంబంధాలను దెబ్బతీయలేదని నిరూపిస్తుంది. ఈ సమతుల్య దౌత్య సంబంధాలు భారత్ ఎప్పటినుంచో అనుసరించే ‘వ్యూహాత్మక స్వయంప్రతిపత్తి’ని ప్రతిబింబిస్తుంది. భౌగోళిక రాజకీయ వైరుధ్యాల్లో చిక్కుకోకుండా, అన్ని ప్రధాన దేశాలతో నిర్మాణాత్మక సంబంధాలను కొనసాగించడంపై భారత్ దృష్టి సారించింది. ఈ విధానం భారత్ తన జాతీయ ప్రయోజనాలను కాపాడుకుంటూనే, విభిన్న కూటముల మధ్య వారధిగా వ్యవహరించడానికి సహాయపడుతోంది.
చమురు దిగుమతులపై అధికంగా ఆధారపడకుండా ఉండేందుకు మోదీ ప్రభుత్వం చేపట్టిన దేశీయ విధానాలు కూడా ఈ వ్యూహానికి బలాన్నిస్తున్నాయి. పునరుత్పాదక ఇంధనం, విద్యుత్ వాహనాలకు ప్రోత్సాహం, ఇథనాల్ మిశ్రమం కార్యక్రమాలు భారతదేశ ఇంధన ముఖచిత్రాన్ని క్రమంగా మారుస్తున్నాయి. రాబోయే దశాబ్దాల్లో గణనీయమైన స్థాయిలో పునరుత్పాదక ఇంధన సామర్థ్యాన్ని సాధించాలనే ప్రభుత్వ లక్ష్యం స్థిరమైన, వైవిధ్యమైన ఇంధన భవిష్యత్తు పట్ల దాని నిబద్ధతను చాటుతోంది. ఉదాహరణకు, భారత్ చేపట్టిన ఇథనాల్ మిశ్రమం కార్యక్రమం ఇప్పటికే గణనీయమైన పురోగతిని సాధించింది. పెట్రోల్లో ఇథనాల్ వాటాను పెంచడం ద్వారా దేశం ముడి చమురు వినియోగాన్ని తగ్గించడమే కాకుండా, రైతులకు, వ్యవసాయ ఆర్థిక వ్యవస్థకు అండగా నిలుస్తోంది. అదేవిధంగా, సౌర, పవన ఇంధన ప్రాజెక్టుల వేగవంతమైన విస్తరణ శిలాజ ఇంధనాలపై ఆధారపడటాన్ని తగ్గిస్తోంది.
ప్రభుత్వ ఇంధన దౌత్యంలో మరొక ముఖ్యమైన అంశం అభివృద్ధి చెందుతున్న సాంకేతికతలలో భాగస్వామ్యం. హైడ్రోజన్ ఇంధనం, బ్యాటరీ స్టోరేజ్, హరిత ఇంధనాలు వంటి రంగాలలో ప్రపంచ దేశాలతో భారత్ సహకారం, తదుపరి తరం ఇంధన వ్యవస్థల్లో భారత్ను అగ్రగామిగా నిలబెడుతున్నాయి. ఈ బహుముఖ వ్యూహం ఫలితాలు ఇప్పుడు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ప్రపంచ సంక్షోభాలు, మార్కెట్ అస్థిరతలు ఉన్నప్పటికీ, భారత్ స్థిరమైన ఇంధన సరఫరాను, ఇతర దేశాలతో పోలిస్తే సాపేక్షంగా నియంత్రిత ధరలను కొనసాగించగలిగింది. దశాబ్ద కాలంలో అత్యంత కఠినమైన అంతర్జాతీయ పరిస్థితులు ఉన్నప్పటికీ దేశం ఆర్థిక వృద్ధి పథంలో సాగుతోంది.
మోదీ ప్రభుత్వ విధానం దీర్ఘకాలిక దార్శనికత కలిగి ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు. స్వల్పకాలంలో తక్కువ ధరకే చమురును సేకరిస్తూనే, భవిష్యత్తు కోసం ప్రత్యామ్నాయ ఇంధన వనరులలో పెట్టుబడులు పెట్టడం ద్వారా భారత్ ప్రస్తుత సవాళ్లను ఎదుర్కొంటూ, భవిష్యత్ అవకాశాలను అందిపుచ్చుకోడానికి సిద్ధమవుతోంది. భౌగోళిక రాజకీయ పోటీ, ఆంక్షలు, అస్థిర సరఫరా గొలుసుల యుగంలో, భారతదేశ ఇంధన, దౌత్య వ్యూహం ఆచరణాత్మక విధాన రూపకల్పనకు ఒక గొప్ప ఉదాహరణగా నిలుస్తోంది. జాగ్రత్తగా పాటించే సమతుల్యత, వైవిధ్యీకరణ, నిరంతర దౌత్య చర్చల ద్వారా బలమైన ప్రపంచ సంబంధాలను కొనసాగిస్తూనే జాతీయ ప్రయోజనాలను ఎలా కాపాడుకోవచ్చో మోదీ ప్రభుత్వం నిరూపించింది. ప్రపంచ ఇంధన సమీకరణాలు మారుతున్న వేళ, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలోని భారతదేశ విధానం, ఒక అభివృద్ధి చెందుతున్న భారీ ఆర్థిక వ్యవస్థ సంక్లిష్ట అంతర్జాతీయ పరిస్థితుల్లో తన ప్రజలకు స్థిరత్వం, వృద్ధి, ఇంధన భద్రతను ఎలా అందించవచ్చో నిరూపిస్తోంది.

