MannKiBaat

అవయవ దానం జీవితాలను మారుస్తుంది

ఫిబ్రవరి 22న ప్రసారమైన ‘మన్ కీ బాత్’లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రసంగంలోని ముఖ్యాంశాలు

అనేక దేశాల నాయకులు, పారిశ్రామికవేత్తలు, ఆవిష్కర్తలు, స్టార్ట్-అప్ రంగంతో సంబంధం ఉన్నవారు దిల్లీలో జరిగిన గ్లోబల్ ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్ కోసం భారత్ మండపంలో సమావేశమయ్యారు. కృత్రిమ మేధా శక్తిని భవిష్యత్తులో ప్రపంచం ఎలా ఉపయోగించుకుంటుందో చెప్పడానికి ఈ సమ్మేళనాన్ని ఒక కీలక మైలురాయిగా చెప్పవచ్చు. ఏఐ సమ్మిట్ ఎగ్జిబిషన్‌లో ప్రపంచ నాయకులకు నేను చాలా విషయాలు చూపించాను. ముఖ్యంగా రెండు ఉత్పత్తులు సమ్మిట్‌లో ప్రపంచవ్యాప్తంగా ఉన్న నాయకులను బాగా ఆకట్టుకున్నాయి. మొదటి ఉత్పత్తిని అమూల్ సంస్థ ప్రదర్శించింది. జంతువుల ఆరోగ్య పరిరక్షణలో కృత్రిమ మేధ మనకు ఎలా సహాయపడుతుందనే విషయాన్ని ఇందులో వివరించారు. ప్రతిరోజూ నిరంతరం కృత్రిమ మేధ సహాయంతో రైతులు వారి డైరీ లెక్కలను, జంతువుల గణనను ఎలా సరి చూస్తారో ఇందులో పేర్కొన్నారు. రెండవ ఉత్పత్తి మన సంస్కృతికి సంబంధించింది. మన పురాతన గ్రంథాలను, మన పురాతన జ్ఞానాన్ని, మన లిఖిత ప్రతులను కృత్రిమ మేధ సహాయంతో సంరక్షిస్తున్న తీరును, నేటి తరానికి అనుగుణంగా వాటిని మారుస్తున్న విధానాన్ని చూసి ప్రపంచవ్యాప్తంగా ఉన్న నాయకులు ఆశ్చర్యపోయారు.

ఈ ఎగ్జిబిషన్ సందర్భంగా శుశ్రుత సంహితను ప్రదర్శనకు ఉంచారు. సాంకేతికత సహాయంతో మనం లిఖితప్రతుల ఇమేజీల నాణ్యతను మెరుగుపరుస్తూ, వాటిని చదవగలిగేలా చేస్తున్న విధానాన్ని మొదటి దశలో చూపించారు. రెండవ దశలో ఈ చిత్రాన్ని యంత్రం చదవగలిగే వచనంగా మార్చారు. తదుపరి దశలో యంత్రం-చదవగలిగే వచనాన్ని ఏఐ అవతార్ ద్వారా చదివించారు. ఆ తర్వాతి దశలో సాంకేతికత సహాయంతో ఈ విలువైన భారతీయ జ్ఞానాన్ని భారతీయ, విదేశీ భాషలలోకి ఎలా అనువదించవచ్చో కూడా మనం ప్రదర్శించాం. ఆధునిక అవతార్ ద్వారా భారతదేశ పురాతన జ్ఞానం గురించి తెలుసుకోవడానికి ప్రపంచ నాయకులు చాలా ఆసక్తిని చూపించారు.

కొన్ని రోజుల కిందట కేరళకు చెందిన ఆలిన్ షెరిన్ అబ్రహాం అనే చిన్న పాపను మనం కోల్పోయాం. ఆ పాప కేవలం 10 నెలల వయసులోనే మరణించింది. ఆమె తల్లిదండ్రులు అనుభవిస్తున్న బాధ మాటల్లో చెప్పలేనిది. కానీ ఇంత తీవ్రమైన బాధ మధ్య కూడా ఆలిన్ తండ్రి అరుణ్ అబ్రహం, తల్లి షెరిన్ ప్రతి పౌరుడి హృదయాన్ని గర్వంతో నింపే నిర్ణయం తీసుకున్నారు. వారు ఆలిన్ అవయవాలను దానం చేయాలని నిర్ణయించుకున్నారు. ఒకవైపు వారు తమ కుమార్తెను కోల్పోయినందుకు దుఃఖిస్తున్నారు. అదే సమయంలో ఇతరులకు సహాయం చేయాలనే గొప్ప భావనతో కూడా వారు నిండిపోయారు. ఏ కుటుంబం కూడా ఇలాంటి విధిని ఎదుర్కోకూడదని వారు కోరుకున్నారు. ఆలిన్ షెరిన్ అబ్రహాం ఇప్పుడు మన మధ్య లేదు. కానీ ఆమె పేరు దేశంలోని అతి పిన్న వయస్కులైన అవయవ దాతల జాబితాలో చేరింది. 

దిల్లీకి చెందిన లక్ష్మీ దేవి గత సంవత్సరం కేదార్‌నాథ్‌కు 14 కిలోమీటర్లు ట్రెక్కింగ్ చేసి ప్రయాణించారు. గుండె మార్పిడి తర్వాత ఆమె ఈ ప్రయాణం చేశారని తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు. ఆమె గుండె కేవలం 15 శాతం మాత్రమే పనిచేస్తోంది. మరణించిన దాత నుండి ఆమెకు గుండె వచ్చింది. ఆమె జీవితం పూర్తిగా మారిపోయింది. పశ్చిమ బెంగాల్‌కు చెందిన గౌరంగ్ బెనర్జీ సముద్ర మట్టానికి 14,000 అడుగుల ఎత్తులో ఉన్న నాథులాకు రెండుసార్లు వెళ్ళారు. ఊపిరితిత్తుల మార్పిడి తర్వాత ఈ ఘనతను సాధించారు. రాజస్థాన్‌లోని సీకర్‌కు చెందిన రామ్‌దేవ్ సింగ్ కిడ్నీ మార్పిడి చేయించుకున్నారు. నేడు ఆయన క్రీడా కార్యకలాపాలలో రాణిస్తున్నారు. ఒక వ్యక్తి చేసే గొప్ప పని లెక్కలేనంత మంది జీవితాలను మార్చగలదని ఇది మరోసారి రుజువు చేస్తుంది.

నేడు దేశం బానిసత్వ చిహ్నాలను వదిలి భారతీయ సంస్కృతికి సంబంధించిన వాటికి విలువ ఇవ్వడం ప్రారంభించింది. మన రాష్ట్రపతి భవన్ కూడా ఈ దిశలో ఒక ముఖ్యమైన అడుగు వేసింది. ‘రాజాజీ ఉత్సవ్’ సందర్భంగా రాష్ట్రపతి భవన్ కేంద్రీయ ప్రాంగణంలో సి. రాజగోపాలాచారి విగ్రహం ఆవిష్కృతమైంది. రాజగోపాలాచారి స్వతంత్ర భారతదేశానికి తొలి భారతీయ గవర్నర్ జనరల్. అధికారాన్ని ఒక పదవిగా కాకుండా సేవగా భావించిన వారిలో ఆయన ఒకరు. ప్రజా జీవితంలో ఆయన ఆచరణ, ఆత్మ సంయమనం, స్వతంత్ర చింతన నేటికీ మనకు స్ఫూర్తినిస్తూనే ఉన్నాయి. దురదృష్టవశాత్తూ స్వాతంత్ర్యం తర్వాత కూడా బ్రిటిష్ పరిపాలకుల విగ్రహాలను రాష్ట్రపతి భవన్‌లో ఉంచడానికి అనుమతించారు. కానీ ఎంతో గొప్పవారైన దేశపుత్రుల విగ్రహాలకు స్థానం ఇవ్వలేదు. బ్రిటిష్ ఆర్కిటెక్ట్ ఎడ్విన్ లుట్యెన్స్ విగ్రహాన్ని కూడా రాష్ట్రపతి భవన్‌లో ఏర్పాటు చేశారు. ఇప్పుడు ఈ విగ్రహం స్థానంలో రాజాజీ విగ్రహం ఉంటుంది. 

‘కేవైసీ- నో యువర్ కస్టమర్- మీ వినియోగదారు గురించి తెలుసుకోండి’ ప్రక్రియ గురించి మీ అందరికీ తెలిసి ఉండవచ్చు మీ కేవైసీ లేదా రీ- కేవైసీని అప్‌డేట్ చేయమని కొన్నిసార్లు మీ బ్యాంక్ నుండి సందేశాలు రావచ్చు. అప్పుడు “నేను ఇప్పటికే కేవైసీ చేశాను. మళ్ళీ ఎందుకు?” అనే ప్రశ్న మీ మనసులో తలెత్తుతుంది. ఇది మీ డబ్బు భద్రత కోసమే. ఈ రోజుల్లో పెన్షన్, సబ్సిడీ, బీమా, యూపీఐ -ప్రతిదీ బ్యాంకు ఖాతాకు అనుసంధానమై ఉందని మనందరికీ తెలుసు. అందుకే మీ బ్యాంక్ ఖాతా సురక్షితంగా ఉండేలా బ్యాంకులు ఎప్పటికప్పుడు తిరిగి- కేవైసీ నిర్వహిస్తాయి. అవును.. ఇక్కడ కూడా మీరు ఒక విషయం గుర్తుంచుకోవాలి. నేరస్థులు నకిలీ కాల్స్ చేస్తారు. ఎస్ ఎం ఎస్, లింకులను పంపుతారు. అందుకే మనం అప్రమత్తంగా ఉండాలి. అలాంటి మోసగాళ్ల బారిన పడకూడదు. మీ కేవైసీ లేదా రీ- కేవైసీని మీ బ్యాంక్ శాఖ లేదా అధికారిక యాప్, అధీకృత మాధ్యమం ద్వారా మాత్రమే చేయించుకోండి. మీ ఓటీపీ, ఆధార్ నంబర్ లేదా బ్యాంక్ ఖాతా సమాచారాన్ని ఎవరితోనూ పంచుకోవద్దు. ముఖ్యంగా మీ పాస్‌వర్డ్‌ను ఎప్పటికప్పుడు మారుస్తూ ఉండండి. ప్రతి సీజన్‌తో ఆహారం, దుస్తులు మారుతున్నట్లే, ప్రతి కొన్ని రోజులకు మీ పాస్‌వర్డ్‌ను మార్చడమనే ఒక నియమాన్ని చేసుకోండి.

ఒడిషాలోని హిరోద్ పటేల్ అనే యువ రైతు వ్యవసాయాన్ని కొత్త దృక్కోణం నుండి చూడడం ప్రారంభించారు. తన వ్యవసాయ చెరువుపై దృఢమైన జాలి నిర్మాణాన్ని పూర్తి చేశారు. దానిపై తీగ కూరగాయలను పండించారు. చెరువు నాలుగు వైపులా అరటిపండ్లు, జామపండ్లు, కొబ్బరికాయలను పండించారు. చెరువులో చేపలను పెంచడం ప్రారంభించారు. ఆయన వ్యవసాయం కూడా మొదలుపెట్టారు. దీని అర్థం సాంప్రదాయిక వ్యవసాయం, కూరగాయలు, పండ్లు, చేపల పెంపకం- అన్నీ ఒకే చోట జరుగుతున్నాయి. దీని వలన మెరుగైన భూ వినియోగం, నీటి పొదుపు, అదనపు ఆదాయం లభించాయి. నేడు ఆయన నమూనాను చూడటానికి సుదూర ప్రాంతాల నుండి కూడా ఎందరో రైతులు వస్తారు.

కేరళలోని త్రిసూర్ జిల్లాలో ఒకే పొలంలో 570 రకాల ధాన్యాన్ని పండించే గ్రామం ఉంది. ఇందులో స్థానిక రకాలు, మూలికా రకాలు, ఇతర రాష్ట్రాల నుండి దిగుమతి చేసుకున్న రకాలు కూడా ఉన్నాయి. ఇది కేవలం వ్యవసాయం మాత్రమే కాదు- విత్తనాల వారసత్వాన్ని కాపాడుకోవడానికి ఒక భారీ ఉద్యమం.

వ్యవసాయ ఉత్పత్తులు ఇప్పుడు వాయుమార్గంలో కూడా విదేశాలకు సులభంగా చేరుతున్నాయి. కర్ణాటక నుండి నంజన్‌గుడ్ అరటిపండ్లు, మైసూరు తమలపాకులు, ఇండి నిమ్మకాయలు మాల్దీవులకు రవాణా అయ్యాయి. ఈ ఉత్పత్తులు వాటి రుచి, నాణ్యతకు ప్రసిద్ధి చెందాయి. జీఐ ట్యాగ్‌ను కూడా పొందాయి. నేటి రైతు నాణ్యతను కోరుకుంటాడు. పరిమాణాన్ని కూడా పెంచుతున్నాడు. తన స్వీయగుర్తింపును కూడా సాధిస్తున్నాడు.

ఈ రోజుల్లో రంజాన్ నెల జరుగుతోంది. కొన్ని రోజుల్లో హోలీ కూడా వస్తోంది. దీని అర్థం రంగులు, గులాల్, నవ్వులతో నిండిన సమయం రాబోతోంది. వోకల్ ఫర్ లోకల్ వంటి కొన్ని మంత్రాలను ఎల్లప్పుడూ గుర్తుంచుకోండి. అనేక విదేశీ తయారీ వస్తువులు మన హోలీ వేడుకల్లోకి, ఇతర పర్వదినాల్లోకి ప్రవేశించాయి. ఈ వస్తువులను అన్ని పండుగల నుండి, హోలీ నుండి కూడా దూరంగా ఉంచండి. స్వదేశీని స్వీకరించండి. మీరు స్వదేశీని కొనుగోలు చేసినప్పుడు దేశాన్ని ఆత్మ నిర్భర్ భారత్ గా చేసే దిశగా స్వావలంబన ఉద్యమానికి కూడా మీరు దోహదపడతారు.