కేంద్ర బడ్జెట్ లో తెలంగాణకు అదనంగా నిధులు
కేంద్ర బడ్జెట్ లో తెలంగాణను విస్మరించారని కాంగ్రెస్, బీఆర్ఎస్ కలిసి అసెంబ్లీలో రాద్ధాంతం చేశారు. అయితే వాస్తవంగా గత ఏడాది కన్నా తెలంగాణకు అదనపు నిధులను ఈ బడ్జెట్ లో సమకూర్చారు. పన్నుల వాటా రూపంలో గతేడాది ప్రవేశపెట్టిన పద్దులో కంటే ఈసారి ఎక్కువ నిధులను కేటాయించారు. ఎందుకంటే ఈ 2024-25 ఆర్థిక సంవత్సరానికి రూ.26,216 కోట్లు అందనుండగా, అదే గతేడాది రూ.23,216 కోట్లు వచ్చాయి. అంటే అదనంగా రూ.3,000 కోట్లు రాష్ట్రానికి దక్కనున్నాయి. పైగా, ఇది ఈ ఏడాది ఫిబ్రవరిలో ప్రవేశపెట్టిన ఓటాన్ ఎకౌంట్ బడ్జెట్లో చూపిన లెక్కల కంటే రూ.577 కోట్లు అధికం. ఈ క్రమంలో ఆదాయపన్ను కింద రూ.9,066.56 కోట్లు, కార్పొరేట్ పన్ను రూపంలో రూ.7,872.25 కోట్లు, సెంట్రల్ జీఎస్టీ కింద రూ.7,832.19 కోట్లు, కస్టమ్స్ కింద రూ.1,157.45 కోట్లు, ఎక్సైజ్ డ్యూటీ కింద రూ.243.98 కోట్లు, సర్వీస్ ట్యాక్స్ కింద రూ.86 లక్షలు, ఇతర పన్నులు, సుంకాలు కింద రూ.43.09 కోట్ల వాటా రాష్ట్రానికి లభించనుంది. దీంతో పాటు 15వ ఆర్థిక సంఘం నిధులు రూ.2,273 కోట్లు కేంద్రం నుంచి రాష్ట్రానికి రానున్నాయి. అయితే ఈ 15వ ఆర్థిక సంఘం నిధుల్లోనే గ్రామీణ స్థానిక సంస్థలకు రూ.1,477 కోట్లు అందనుండగా, పట్టణ స్థానిక సంస్థలకు రూ.796 కోట్లు రానున్నాయి.
స్మార్ట్ సిటీ ప్రాజెక్టుకు నిధులు : బడ్జెట్లో దేశంలోని మరో ఏడాదిపాటు స్మార్ట్ సిటీల ప్రాజెక్టును కేంద్రం కొనసాగించేందుకు అంగీకరించింది. దీంతో పాటు అదనంగా రూ.2,236 కోట్లను పద్దులో కేటాయింపులు చేసింది. ఇది రాష్ట్రంలోని వరంగల్, కరీంనగర్ లాంటి స్మార్ట్ సిటీలకు లబ్ధిని చేకూర్చనుంది. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి స్మార్ట్ సిటీ ప్రాజెక్టును కొనసాగించాలని కోరింది. దీనికి అనుగుణంగానే బడ్జెట్లో ఇందుకు సంబంధించిన నిధులు కేటాయింపుతో ఈ రెండు నగరాల్లో పెండింగ్ పనులు పూర్తి కావడానికి దారులు తెరుచుకున్నాయి. ఈ ప్రాజెక్టుకు సంబంధించి కేంద్రం నుంచి రాష్ట్రానికి ఎంతో కొంత నిధులు రావచ్చని అధికారులు అభిప్రాయపడుతున్నారు.
అమృత్ పథకానికి నిధుల పెంపు : పట్టణాల అభివృద్ధికి కేంద్రం అమృత్ పథకాన్ని తీసుకువచ్చింది. దీనికి ప్రతి బడ్జెట్లోనూ కేటాయింపులు చేస్తూ వచ్చారు. అయితే ఈసారి కూడా నిధుల కేటాయింపును కేంద్రం పెంచింది. గతేడాది రూ.4,222 కోట్లు కేటాయించగా ఈసారి బడ్జెట్లో రూ.6,931 కోట్లు కేటాయింపులు చేశారు. ఈ పెంపు రాష్ట్రంలోని అమృత పట్టణాల్లో పెండింగ్లో ఉన్న పనులు పూర్తికావడానికి ఎంతో దోహదపడుతుంది.
ప్రధానమంత్రి ఆవాస్ యోజన నిధులు పెంపు : పేదల సొంతింటి కలను సాకారం చేసేందుకు ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకాన్ని కేంద్రం ప్రారంభించింది. ఈ బడ్జెట్లో మాత్రం నిధుల కేటాయింపును పెంచింది. ఈ ఏడాది రూ.23,613 కోట్లను కేంద్రం కేటాయించింది. ఈ కేటాయింపులతో రాష్ట్రంలో ఇళ్ల నిర్మాణానికి ఎంతోగానే ఉపయోగం కానున్నాయి. రాష్ట్రానికి ఎంతో కొంత మేర నిధులు వస్తాయని ప్రభుత్వం ఆశిస్తోంది.
మారుమూల ప్రాంతాలకు రోడ్లు : ప్రధానమంత్రి గ్రామ్ సడక్ యోజనకు ఈసారి బడ్జెట్లో కేటాయింపులు దక్కాయి. రూ.18,894 కోట్లను గ్రామాల్లో రోడ్లు వేయడానికి కేంద్రం ఇవ్వనుంది. దీంతో రాష్ట్రంలో మారుమూల గ్రామాల్లో రోడ్ల వసతి మెరుగయ్యేందుకు ఇది ఎంతగానే ఉపయుక్తంగా ఉండనుంది.
రాష్ట్రంలో ఐటీఐ అప్ గ్రేడేషన్ కు అవకాశం : ఈసారి కేంద్రం బడ్జెట్లో ఐటీఐల అప్ గ్రేడేషన్ కు రూ.645 కోట్లు కేటాయింపులు చేసింది. దీంతో రాష్ట్రంలోని ఐటీఐల అప్ గ్రేడేషన్ కు అవకాశం రానుంది. ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వం ఐటీఐల ఆధునీకరణకు నడుం బిగించింది.
థీమ్ బేస్డ్ టూరిస్ట్ సర్క్యూట్లకు నిధులు : ఈ కేంద్ర బడ్జెట్లో రూ.1,715 కోట్లను థీమ్ బేస్డ్ టూరిస్ట్ సర్క్యూట్లకు కేటాయించారు. ఇది రాష్ట్రంలోని థీమ్ బేస్డ్ టూరిస్ట్ సర్క్యూట్ల ద్వారా పర్యాటక అభివృద్ధికి దోహదం చేస్తుంది.
ఏకలవ్య పాఠశాలలకు భారీగా నిధులు కేటాయింపు : ఈసారి కేంద్ర బడ్జెట్లో ఏకలవ్య పాఠశాలలకు కేటాయింపులు భారీగానే చేశారు. గతేడాది రూ.1,815 కోట్లు కేటాయింపులు చేయగా ఈసారి రూ.4,660 కోట్లకు పెంచారు. రాష్ట్రంలో 23 ఏకలవ్య గురుకుల పాఠశాలలు ఉండగా నిధులు కేటాయించే అవకాశం ఉంది. దీంతో శాశ్వత భవనాల నిర్మాణం వంటివి ముందుకు సాగనున్నాయి.
జాతీయ ఆరోగ్య మిషన్ నిధులు యథాతథం : జాతీయ ఆరోగ్య మిషన్ కు కేటాయింపులు గతేడాదితో పోలిస్తే యథాతథంగా ఉన్నాయి. పట్టణ ప్రాంతాల్లో దోమల ద్వారా వ్యాపించే వ్యాధులతో పాటు టీబీ, కుష్ఠు వ్యాధుల నివారణ కార్యక్రమాలకు రాష్ట్రానికి అండగా నిలిచేందుకు కేంద్రం కేటాయింపులు చేసింది. ఆ కేటాయింపులు రూ.38 కోట్ల నుంచి రూ.141 కోట్లకు పెంచారు.
రికార్డు స్థాయిలో రైల్వేలకు నిధులు
తెలంగాణ రైల్వేకు రికార్డు స్థాయిలో రూ.5,336 కోట్లు బడ్జెట్ లో కేటాయించినట్లు కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్ తెలిపారు. యూపీఏ హయాంతో పోలిస్తే ఇది 6 రెట్లు అధికం అని చెప్పారు. తెలంగాణలో ప్రస్తుతం రూ.32,946 కోట్ల ప్రాజెక్టులు జరుగుతున్నాయని, అమృత్ పథకంలో భాగంగా 40 రైల్వే స్టేషన్లు ఆధునికీకరించామని తెలిపారు. తెలంగాణలోనూ 100 శాతం విద్యుదీకరణ పూర్తయ్యిందని చెప్పుకొచ్చారు. గడిచిన 10 ఏళ్లలో 437 ఫ్లై ఓవర్లు, అండర్ పాస్ల నిర్మాణం జరిగిందని చెప్పారు. దేశంలో రూ.1.9 లక్షల కోట్లతో రైల్వే సేఫ్టీ కోసం కేటాయింపులు చేసినట్లు ఆయన వెల్లడించారు. రైల్వే ప్రమాదాలు యూపీఏ హయాంతో పోలిస్తే తమ ప్రభుత్వంలో 60 శాతం తగ్గాయని కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్ చెప్పుకొచ్చారు.
కృష్ణ చైతన్య

