tiranga yatra

తిరంగా యాత్ర : త్రివర్ణ శోభితంగా ట్యాంక్‌బండ్

భారత భద్రతా బలగాలకు సంఘీభావం తెలుపుతూ మే 17న సాయంత్రం హైదరాబాద్‌ ట్యాంక్‌బండ్ పై చేపట్టిన ‘తిరంగా యాత్ర’ విజయవంతమైంది. సిటిజెన్స్ ఫర్ నేషన్ ఆధ్వర్యంలో డాక్టర్ బీఆర్ అంబేద్కర్ భారీ విగ్రహం నుంచి స్వామి వివేకానంద విగ్రహం వరకు అంగరంగ వైభవంగా ఈ యాత్ర సాగింది. హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల ప్రజలు పెద్దఎత్తున పాల్గొనడంతో హుస్సేన్ సాగర్ జనసాగరంగా మారింది. ట్యాంక్‌బండ్ పరిసర ప్రాంతాలు కిక్కిరిసిపోయాయి. యువత మువ్వన్నెల జెండాలను చేతబట్టుకొని రావడంతో ట్యాంక్‌బండ్ త్రివర్ణ శోభితంగా మారింది. ఉగ్రవాదానికి వ్యతిరేకంగా, భారత భద్రతా బలగాలకు, ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి మద్దతుగా ప్లకార్డులు ప్రదర్శించారు. ‘భారత్‌ మాతాకీ జై’, ‘జై జవాన్‌’, ‘వందేమాతరం’ నినాదాలతో ట్యాంక్‌బండ్‌ పరిసరాలు మార్మోగాయి. యాత్ర సాగుతున్నంత సేపూ దేశభక్తిపూరిత వాతావరణం వెల్లివిరిసింది.

ఈ కార్యక్రమంలో మాజీ ఉపరాష్ట్రపతి ఎం. వెంకయ్య నాయుడు, మాజీ గవర్నర్ సీహెచ్ విద్యాసాగర్ రావు, బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి జి కిషన్ రెడ్డి, బిజెపి జాతీయ ఉపాధ్యక్షురాలు, మహబూబ్ నగర్ ఎంపీ డికే అరుణ, బిజెఎల్పీ నాయకుడు ఏలేటి మహేశ్వర్ రెడ్డి, శాసనమండలి బిజెపి పక్షనేత ఏవీఎన్ రెడ్డి, ఎంపీలు ఈటల రాజేందర్, ధర్మపురి అరవింద్, కొండా విశ్వేశ్వర్ రెడ్డి, ఎం రఘునందన్ రావు, గోడెం నగేష్, ఆర్ కృష్ణయ్య, శాసనసభ్యులు వెంకటరమణా రెడ్డి, రామారావు పవార్, పైడి రాకేష్ రెడ్డి, ధన్ పాల్ సూర్యనారాయణ గుప్తా, శాసనమండలి సభ్యులు సీ అంజిరెడ్డి, మల్కా కొమరయ్య, బిజెపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు దుగ్యాల ప్రదీప్ కుమార్, బంగారు శృతి, డాక్టర్ కాసం వెంకటేశ్వర్లు, తిరంగా యాత్ర సభ్యులు డాక్టర్ గౌతమ్ రావు, డీఆర్డీఓ మాజీ చైర్మన్ సతీష్ రెడ్డి, జమ్ముకశ్మీర్ మాజీ డీజీలు రాజేంద్రకుమార్, గోపాల్ రెడ్డి, సీఆర్పీఎఫ్ మాజీ డీజీ కృష్ణారెడ్డి, సమ్మక్క-సారక్క యూనివర్సిటీ వీసీ వై.ఎల్ శ్రీనివాస్, మాజీ పార్లమెంట్ సభ్యురాలు ప్రముఖ నటి జయప్రద, సినీహీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్, ప్రముఖ నటి మంచు లక్ష్మి, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు తనయుడు రామకృష్ణ, ప్రముఖ గాయనీ మంగ్లీ, మంద కృష్ణ మాదిగ, పాట్నా హైకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎల్ నరసింహారెడ్డి, లెఫ్టినెంట్ జనరల్ రవిప్రసాద్, నారాయణన్, మేజర్ జనరల్ రజత్ మజూర్, శ్రీనివాసరావు, కల్నల్ నగేష్ తదితరులు పాల్గొన్నారు. కులమతాలకు, పార్టీలకు అతీతంగా సమాజంలోని అన్ని వర్గాల ప్రజలు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. డాక్టర్లు, న్యాయవాదులు, టీచర్లు, కరాటే విద్యార్థులు, ఎన్సీసీ క్యాడేట్స్, ఆర్మీ వెటరన్స్, మహిళా సంఘాలు, బ్రాహ్మ కుమారీస్, నగరంలో వివిధ పాఠశాలల విద్యార్థులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా వెంకయ్య నాయుడు మాట్లాడుతూ.. కశ్మీర్‌ దేశంలో అంతర్భాగమన్నారు. ఈ అంశంపై పాకిస్థాన్‌తో చర్చించాల్సిన అగత్యం భారత్‌కు లేదని స్పష్టం చేశారు. కశ్మీర్‌ అంశంపై మధ్యవర్తిత్వం వహించడానికి అమెరికా, చైనా లాంటి దేశాల సహాయం అవసరం లేదన్నారు. ‘మన దేశాన్ని మనం రక్షించుకోగలం. ప్రపంచంలోని అన్ని దేశాలతో భారత్‌ స్నేహంగా ఉంటుంది. ఒకప్పుడు పాకిస్థాన్‌తోనూ స్నేహంగా ఉండాలని ప్రయత్నించాం. ఉగ్రవాదాన్ని ప్రోత్సహించడంతో ఆ ఆలోచన విరమించుకున్నాం. పాక్‌ ఆక్రమిత కశ్మీర్‌(పీఓకే)ను అప్పగించడమే ఆ దేశానికి ఉన్న ఏకైక మార్గం. మనం ఆత్మరక్షణ కోసం మాత్రమే అణ్వాయుధాలను సమకూర్చుకున్నాం. పహల్గాం దాడి లాంటి క్లిష్ట సమయంలో ప్రధాని మోదీ.. సమయస్ఫూర్తితో వ్యూహాత్మకంగా వ్యహరించారు. మన దళాలు కేవలం 25 నిమిషాల్లో పాకిస్థాన్‌లోని ఉగ్రమూకల్ని మట్టుబెట్టాయి. పాక్‌ దుష్ట పన్నాగాలను, కుయుక్తులను ప్రజలకు తెలిసేలా యువకులంతా కృషి చేయాలి’’ అని వెంకయ్య నాయుడు పేర్కొన్నారు. 

మాజీ గవర్నర్‌ విద్యాసాగర్‌ రావు మాట్లాడుతూ.. హైదరాబాద్‌లోనూ కొందరు స్లీపర్‌సెల్స్‌ ఉన్నారని, వారికి కొన్ని రాజకీయ శక్తులు అండగా ఉంటున్నాయని ఆరోపించారు. ఆ ముష్కరులను మట్టుబెట్టాల్సిన అవసరం ఉందన్నారు. ‘మనం ప్రశాంతంగా ఉండటానికి కారణం.. సరిహద్దుల్లో వీరోచితంగా పోరాడుతున్న సైనికులే’ అని ఎంపీ డీకేఅరుణ పేర్కొన్నారు. ‘భారత్‌ ఉన్నతిని సహించని పాకిస్థాన్‌ ముష్కరులు.. పర్యాటకులను అన్యాయంగా చంపేశారు. ఆ హేయమైన చర్యకు ఆపరేషన్‌ సిందూర్‌ ద్వారా దీటైన సమాధానం ఇచ్చాం’ అని ఎంపీ ఈటల తెలిపారు. డీఆర్‌డీవో మాజీ ఛైర్మన్‌ సతీశ్‌రెడ్డి మాట్లాడుతూ.. ‘ఆపరేషన్‌ సిందూర్‌లో వినియోగించినవన్నీ.. స్వదేశీ ఆయుధాలే. బ్రహ్మోస్, ఆకాశ్‌ క్షిపణులు హైదరాబాద్‌లో తయారు చేసినవే కావడం విశేషం’’ అని పేర్కొన్నారు.