వాజ్పేయి పాలన స్వతంత్ర భారత చరిత్రలో స్వర్ణయుగం
పోఖ్రాన్ అణు పరీక్షల సమయంలో ప్రపంచ దేశాలు భారత్పై ఆంక్షలు విధించినప్పటికీ నాటి ప్రధాని వాజ్పేయి ఏమాత్రం వెనుకడుగు వేయకుండా దేశాన్ని ఆర్థికంగా ముందుకు నడిపించారని బిజెపి తెలంగాణ అధ్యక్షుడు ఎన్. రాంచందర్ రావు అన్నారు. బియ్యం, గోధుమల వంటి ఆహార ధాన్యాల సరఫరా, ఎగుమతి వ్యవస్థలో మార్పులు ఆయన పాలనలోనే చోటుచేసుకున్నాయని తెలిపారు. వాజ్పేయి పాలన స్వతంత్ర భారత చరిత్రలో స్వర్ణయుగం అని అన్నారు. ఆగస్ట్ 16న మాజీ ప్రధాని, భారతరత్న అటల్ బిహారీ వాజ్పేయి పుణ్యతిథి సందర్భంగా బిజెపి రాష్ట్ర కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో బిజెపి తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు ఎన్. రాంచందర్ రావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వాజ్పేయి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం వాజ్పేయి విశిష్ట సేవలను స్మరించుకున్నారు. ఈ కార్యక్రమంలో బిజెపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డా. కాసం వెంకటేశ్వర్లు, రాష్ట్ర ఉపాధ్యక్షులు చింతల రామచంద్రా రెడ్డి, రాష్ట్ర కార్యదర్శులు డా. ఎస్. ప్రకాష్ రెడ్డి, మాధవి, సీనియర్ నాయకుడు మర్రి శశిధర్ రెడ్డి తదితర నాయకులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా రాంచందర్ రావు మాట్లాడుతూ.. ‘‘అటల్ బిహారీ వాజ్పేయి ఒకసారి 13 రోజులు, మరోసారి 13 నెలలు, తర్వాత నాలుగున్నర సంవత్సరాలు ప్రధానమంత్రిగా పనిచేశారు. ఆయన నాయకత్వంలో భారతదేశం ప్రపంచంలో అగ్రస్థానంలో నిలిచింది. ఆర్థికంగా కూడా దేశాన్ని ముందుకు తీసుకెళ్లడంలో ఆయన పాలన ఒక నిదర్శనం. గ్రామీణ సడక్ యోజన, ప్రధానమంత్రి స్వర్ణ చతుర్భుజి ప్రాజెక్ట్ ద్వారా జాతీయ రహదారులు, ఎయిర్పోర్టులు వంటి అనేక మౌలిక వసతుల నిర్మాణాలు జరిగాయి.
వాజ్పేయి స్వయంసేవక్ సంఘ్ ప్రచారకుడిగా తన జీవితం ప్రారంభించి, ఆర్ఎస్ఎస్ నుంచి భారతీయ జనతా పార్టీలో చేరి దేశ ప్రధానిగా కావడం ఆయన అసామాన్య వ్యక్తిత్వానికి నిదర్శనం. అలాంటి గొప్ప వ్యక్తులను తీర్చిదిద్దిన ఆర్ఎస్ఎస్కు మనమంతా రుణపడి ఉన్నాం. రహదారుల నిర్మాణం ద్వారా దేశాన్ని అభివృద్ధి దిశగా పరుగులు పెట్టించిన వాజ్పేయి ప్రజల గుండెల్లో శాశ్వతంగా నిలిచిపోయారు. కొందరు ఆర్ఎస్ఎస్పై తప్పుగా మాట్లాడుతున్నారు. కానీ ఆర్ఎస్ఎస్ భారతదేశంలో పుట్టిన, భారతదేశం కోసం పుట్టిన సంస్థ. విమర్శకుల్లా చైనా, పాకిస్థాన్ ప్రయోజనాల కోసం మాట్లాడే పార్టీ కాదు. పేదలకు ఇండ్లు కల్పించాలనే సంకల్పంతో వాజ్పేయి వాంబే పథకాన్ని ప్రారంభించారు. ఈ పథకం కింద అనేక మంది పేదలకు ఇండ్లు నిర్మించి ఇచ్చారు. ఇప్పటికీ వారు ఆ ఇళ్లలో నివసిస్తున్నారు. బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజలకు ఇచ్చిన హామీలను మరిచిపోయాయి. సీఎం రేవంత్ రెడ్డి అబద్ధపు వాగ్దానాలతో ప్రజలను మభ్యపెట్టారు. రూ.22,500 కోట్లు కేటాయించి ఇండ్లు నిర్మిస్తామని కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటించింది. రాష్ట్రంలోని 119 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ప్రతి నియోజకవర్గంలో 3,500 ఇండ్లు కడతామని హామీ ఇచ్చింది. కానీ 19 నెలలు గడిచినా ఇప్పటి వరకు ఇండ్లు ఇచ్చిన దాఖలాల్లేవు. నిజమైన పేదలకు ఇండ్లు ఇవ్వకుండా, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలకు మాత్రమే డబుల్ బెడ్రూమ్ ఇండ్లు కేటాయించే ప్రయత్నం జరుగుతోంది. దీని వలన అర్హులైన పేదలు మోసపోతున్నారు. అటల్ బిహారీ వాజ్పేయి పాలన మనకు స్ఫూర్తి, మార్గదర్శనం. బిజెపి కార్యకర్తలు మాత్రమే కాకుండా, ప్రతి పౌరుడు, ప్రతి రాజకీయ నాయకుడు కూడా ఆయన ఆశయబాటలో నడవడానికి కృషి చేయాలి.’’ అని అన్నారు.

