Kiren Rijiju

మాలో ఒక్క మంత్రి మీదైనా అవినీతి ఆరోపణలు వచ్చాయా?

Kiren Rijijuనీట్ పేపర్ లీకేజీ విషయంలో కేంద్ర విద్యా శాఖ మంత్రి రాజీనామా చేయాలనే డిమాండ్ కేవలం విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యల నుంచి రాజకీయ ప్రయోజనం పొందే ప్రయత్నం మాత్రమే అని కేంద్ర పార్లమెంటరీ, మైనారిటీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు అభిప్రాయం వ్యక్తం చేశారు. జరిగిన పొరబాటుకు తానే నైతిక బాధ్యత వహిస్తానని విద్యాశాఖ మంత్రి ప్రకటించారని, ఆయన బాధ్యత నుంచి పారిపోవడం లేదని వ్యాఖ్యానించారు. దానికి బదులుగా సమస్యను పరిష్కరించడాన్ని ఒక సవాలుగా తీసుకున్నారని తెలిపారు. యూపీఏ పాలనలో ప్రతి నెలా మంత్రులపై అవినీతి ఆరోపణలు వచ్చేవని, కానీ గత 12 ఏళ్లలో లంచాలు తీసుకున్నారని లేదా కమీషన్లు తీసుకున్నారని, వ్యవస్థను దుర్వినియోగం చేశారని ఏ మంత్రిపైనా ప్రత్యక్ష ఆరోపణలు రాలేదని తేల్చి చెప్పారు. ఉత్తరప్రదేశ్ వంటి ప్రాంతాలలో ఒక ఎమ్మెల్యే దాదాపు నాలుగు లక్షల మంది ప్రజలకు ప్రాతినిధ్యం వహిస్తున్నారని, ఇది యూరప్‌లోని 20 మంది ఎంపీలతో సమానమన్నారు. ఎన్నికైన ప్రతినిధి మొత్తం ప్రాంతాన్ని తిరగలేకపోతే లేదా ప్రజలను కలవలేకపోతే, అది ఒక లోపంగా మారుతుందని, దాన్ని సరిదిద్దాలని అన్నారు. సీజేపీ కేవలం కాంగ్రెస్ పార్టీకి మాత్రమే సవాలు విసురుతోందని, ఆందోళన చెందాల్సింది వారేనని స్పష్టం చేశారు. ఒక జాతీయ ఆంగ్ల దినపత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో కేంద్రమంత్రి కిరణ్ రిజిజు రాజ్యాంగ సవరణ బిల్లు ఆవశ్యకత, మైనారిటీలపై దాడులు, పార్లమెంటులో బిల్లులు ఆమోదం పొందకపోవడానికి గల కారణాలు, ప్రభుత్వం ఎదుర్కొంటున్న ప్రధాన సవాళ్ళపై మాట్లాడారు. ఇంటర్వ్యూలోని కొన్ని భాగాలు:

ప్ర: ఎన్డీయే ప్రభుత్వం 12 ఏళ్ల పాలనను పూర్తి చేసుకున్న తరుణంలో ఇటీవల పార్లమెంటులో రాజ్యాంగ సవరణ బిల్లు వీగిపోయింది. దీనికి మీరు ముందే సిద్ధపడి ఉన్నారా?

జ: మహిళా రిజర్వేషన్ బిల్లు వీగిపోవడం మాకు తీవ్ర అసంతృప్తిని, ఆవేదనను కలిగించింది.

ప్ర: మహిళా రిజర్వేషన్ బిల్లు వీగిపోలేదు కదా.

జ: దాని అమలు ప్రక్రియ వీగిపోయింది. మీరు దాన్ని రాజ్యాంగ (131వ సవరణ) బిల్లు అని పిలవవచ్చు, కానీ ప్రాథమికంగా అది లోక్‌సభ, అసెంబ్లీలలో మహిళా రిజర్వేషన్ల అమలుకు సంబంధించినది. ప్రతిపక్షాల వైఖరి రెండు కారణాల వల్ల ఊహించని విధంగా ఉండటంతో మేము తీవ్రంగా కలత చెందాం. మొదటిది, 2023లో అన్ని ప్రతిపక్ష పార్టీలు మద్దతు ఇచ్చిన ‘నారీ శక్తి వందన్ అధినియం’ బిల్లునే ఏకగ్రీవంగా ఆమోదించారు. 2026 తర్వాత జరిగే జనాభా గణన ఆధారంగానే ఈ బిల్లును అమలు చేస్తామని అప్పట్లో స్పష్టంగా పేర్కొన్నాం. అయితే కులాల వారీ జనాభా గణనకు చాలా సమయం పడుతుంది కాబట్టి, మనం 2011 జనాభా లెక్కలను ప్రాతిపదికగా తీసుకోవాల్సి ఉంటుంది. అందుకు రాజ్యాంగ సవరణ అవసరం. అది లేకుండా నారీ శక్తి వందన్ అధినియం బిల్లు అమలులో చేర్చాల్సిన అవసరమైన అంశాలను మనం చేర్చలేం. ఇక రెండో విషయానికొస్తే, ఈ బిల్లును మేము హఠాత్తుగా ఏమీ తీసుకురాలేదు, అన్ని పక్షాలతో, ముఖ్యంగా పెద్ద రాజకీయ పార్టీలతో సంప్రదింపులు జరిపాం. కాంగ్రెస్, తృణమూల్, ఆప్ మినహా మిగిలిన పార్టీలన్నీ మాతో చేతులు కలిపాయి, అంగీకరించాయి.

ప్ర: మీరు అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేయలేదన్నది ప్రతిపక్షాల ప్రధాన వాదన. పైగా సమావేశాలకు రెండు రోజుల ముందే బిల్లును తెచ్చారని, ఇతర పార్టీలకు మీరు వాగ్దానం చేసిన 50 శాతం సీట్ల పెంపు గురించి ప్రస్తావించకుండా, కేవలం లోక్‌సభ సీట్ల సంఖ్యను మాత్రమే పేర్కొన్నారని వారు అంటున్నారు. మహిళా రిజర్వేషన్ల నుంచి దీన్ని వేరు చేస్తే తాము సిద్ధమేనని కాంగ్రెస్ చెప్పింది. దీనిపై మీరేమంటారు?

జ: పార్లమెంట్ మొదటి విడత సమావేశాలు జరుగుతున్నప్పుడే మేము సంప్రదింపుల ప్రక్రియను ప్రారంభించాం. అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేయాలనే డిమాండ్ చాలా ఆలస్యంగా వచ్చింది. మల్లికార్జున్ ఖర్గే నాకు మూడు లేఖలు రాశారు. నేను అప్పటికే డిఎంకె, సమాజ్‌వాదీ పార్టీ, శివసేన వంటి మెజారిటీ రాజకీయ పార్టీలతో సంప్రదింపులు పూర్తి చేసిన తర్వాత… అఖిలపక్ష సమావేశాన్ని వాయిదా వేయాలని మొదటి లేఖలో డిమాండ్ చేశారు. సంప్రదింపుల ప్రక్రియ మొత్తం పూర్తయిన తర్వాత ఇక అఖిలపక్ష సమావేశాన్ని పిలవడంలో అర్థం ఏముంది? మేము 70 శాతం ప్రతిపక్ష పార్టీలను కలిశాం. ఆ తర్వాత కాంగ్రెస్ హఠాత్తుగా అఖిలపక్ష సమావేశాన్ని డిమాండ్ చేసింది, ఇది కేవలం ఒక ఎత్తుగడ మాత్రమే.

ప్ర: మరి ఇకముందు ఏం చేయబోతున్నారు?

జ: దీనిపై నేను ఇప్పుడు ఎలాంటి హామీ ఇవ్వలేను, ఎందుకంటే ఇది క్యాబినెట్ ముందుకు వచ్చి, అక్కడ నిర్ణయం జరిగే వరకు వేచి చూడాలి.

ప్ర: సీబీఎస్ఈ మూల్యాంకనం, నీట్ పేపర్ లీకేజీ వల్ల చాలా మంది విద్యార్థులు నష్టపోయారు. ఈ విషయంలో ప్రభుత్వం విఫలమైందా?

జ: ప్రభుత్వం విఫలమైందని మీరు చెప్పలేరు. కానీ విద్యార్థులకు న్యాయం ఎలా చేయాలో అనే అంశంపైనే మనం దృష్టి పెట్టాలి. పునఃమూల్యాంకనం నుంచి పునఃమదింపు వరకు ఎన్నో చర్యలు తీసుకున్నాము. ఇప్పుడు పోర్టల్స్ ఏర్పాటు చేశాం. చాలా మంది విద్యార్థులు తమ పేర్లను నమోదు చేసుకుని, సందేహాలను పంపారు. సైబర్ దాడులు జరిగినప్పటికీ, వాటిని సరిదిద్దడానికి ప్రభుత్వం అవసరమైన చర్యలు తీసుకుంది. భవిష్యత్తులో ఇటువంటి అక్రమాలు జరగకుండా వ్యవస్థను పారదర్శకంగా మార్చడమే మా ప్రాథమిక లక్ష్యం. మనమంతా కలిసి కూర్చుని సంస్కరణలు జరిగేలా చూస్తే విద్యార్థుల భవిష్యత్తు బాగుంటుంది.

ప్ర: ఈ వైఫల్యానికి ప్రభుత్వంలో ఎవరో ఒకరు బాధ్యత వహించాలని మీరు అనుకోవడం లేదా?

జ: మొదటగా, వ్యవస్థను దెబ్బతీయడానికి ఏ స్థాయిలోనైనా ఎవరైనా ఉద్దేశపూర్వకంగా ప్రయత్నించి ఉంటే, వారిపై కఠిన చర్యలు తీసుకోవాలి. విద్యార్థుల్లో నమ్మకాన్ని పెంపొందించేందుకు సీబీఎస్‌ఈ చైర్మన్, సెక్రటరీలను బదిలీ చేశాం. వ్యవస్థను మార్చేందుకు కొత్త ప్రతిపాదనలు సిద్ధంగా ఉన్నాయి. ఈ పొరపాటుకు తానే నైతిక బాధ్యత వహిస్తానని విద్యాశాఖ మంత్రి ఇప్పటికే ప్రకటించారు. ఆయన బాధ్యత నుంచి పారిపోవడం లేదు, దానికి బదులుగా సమస్యను పరిష్కరించడాన్ని ఒక సవాలుగా తీసుకున్నారు. విద్యా మంత్రి రాజీనామా చేయాలనే డిమాండ్ కేవలం విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యల నుంచి రాజకీయ ప్రయోజనం పొందే ప్రయత్నం మాత్రమే.

ప్ర: ఒకవేళ బిజెపి ప్రతిపక్షంలో ఉండి ఉంటే మీరు విద్యా మంత్రి రాజీనామాను డిమాండ్ చేసేవారు కాదా?

జ: దానికి దీనికి చాలా తేడా ఉంది. అవినీతి లేదా అక్రమాలు మంత్రి లేదా మంత్రి సిబ్బంది ద్వారా జరిగితే, దానికి మంత్రి బాధ్యత వహిస్తారు. కానీ ఒక స్వయంప్రతిపత్తి కలిగిన సంస్థ లోపల సమస్య తలెత్తితే, దానికి ఆ సంస్థలే సమాధానం చెప్పుకోవాలి. సీబీఎస్‌ఈ అనేది ఒక స్వయంప్రతిపత్తి కలిగిన సంస్థ. అలాగే జాతీయ పరీక్షల నిర్వహణ సంస్థ (ఎన్టీయే ) కూడా ఉంది, వీటిని ప్రతిరోజూ మంత్రి నేరుగా పర్యవేక్షించరు. మేము ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ప్రతి నెలా మంత్రులపై అవినీతి ఆరోపణలు వచ్చేవి. గత 12 ఏళ్లలో లంచాలు తీసుకున్నారని లేదా కమీషన్లు తీసుకున్నారని, వ్యవస్థను దుర్వినియోగం చేశారని ఏ మంత్రిపైనా ప్రత్యక్ష ఆరోపణలు రాలేదు… కాబట్టి, కాంగ్రెస్ ఏం చేసింది, మేం ఏం చేశాం అనే తేడాను గుర్తించండి.

ప్ర: మైనారిటీల ప్రయోజనాల కోసం మన్మోహన్ సింగ్ 15 సూత్రాల కార్యక్రమాన్ని ప్రారంభించారు, 2014-15లో అన్ని కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలలో 8.71 శాతం మైనారిటీలు నియమితులయ్యారు. 2014-15 తర్వాత ఇప్పటివరకు కేంద్ర ప్రభుత్వంలో ఎంత శాతం మైనారిటీలు నియమితులయ్యారు?

జ: నేను కేవలం కొన్ని సంస్థల్లో నియామకాలను మాత్రమే చూడను. మొత్తంగా పరిశీలించండి. మోదీ ప్రధాని అయిన 12 ఏళ్ల తర్వాత భారతదేశంలో మైనారిటీల పరిస్థితి ఎంతో మెరుగ్గా ఉంది. మైనారిటీలు సురక్షితంగా లేరంటూ పదేపదే నినాదాలు చేయడం కాంగ్రెస్, వామపక్ష సంస్థలకు అలవాటుగా మార్చుకుంది. ‘సబ్కా సాత్, సబ్కా వికాస్’ అంటే ప్రతి పథకం అందరి కోసమే అని అర్థం. మతపరమైన వేధింపుల వల్ల భారతదేశాన్ని విడిచిపెట్టి వెళ్లిన ఒక్క వ్యక్తి పేరైనా ఎవరైనా చెప్పగలరా? భారతదేశంలో ముస్లింలు సురక్షితంగా లేరని చెప్పడం ద్వారా కొందరు దేశ ప్రతిష్టను దిగజార్చుతున్నారు. ఆఫ్ఘనిస్తాన్ నుంచి హిందువులు, సిక్కులు భారతదేశానికి వచ్చారు, పాకిస్తాన్ నుంచి కూడా వచ్చారు.

1959లో టిబెట్‌లో సమస్యలు మొదలైనప్పుడు, వారు (టిబెటన్లు) భారతదేశానికి ఎందుకు వచ్చారు? భారతదేశం అందరినీ కలుపుకొనిపోతుందని ఇది నిరూపిస్తోంది. ఇది కేవలం బిజెపి వల్ల మాత్రమే కాదు, భారతీయ సమాజం నైజమే అటువంటిది. కానీ అక్రమ వలసదారులను మేము అంగీకరించబోమని చాలా స్పష్టంగా చెప్పాం. మన దేశంలో సమస్యలు సృష్టించే ఎవరినీ మేము సహించం. నియామకాల విషయానికొస్తే, అర్హులైన వ్యక్తులు ఎక్కడున్నా వారికి నియామకాలు జరుగుతాయి. మేము ఎవరినీ సంతోషపెట్టేందుకు ప్రయత్నించం. మా సిద్ధాంతం చాలా సులభం—అందరికీ న్యాయం, ఎవరిపట్లా ప్రత్యేక పక్షపాతం లేదు. ఏ సంస్థలోనైనా ఎవరికైనా నియామకం దక్కకుండా ఉద్దేశపూర్వకంగా అడ్డుకునే ప్రయత్నమేదీ జరగడం లేదు.

ప్ర: ఫిబ్రవరిలో, క్యాథలిక్ బిషప్స్ కాన్ఫరెన్స్ ఆఫ్ ఇండియా క్రైస్తవులపై, ముఖ్యంగా ప్రార్థనల సమయంలో జరుగుతున్న దాడుల గురించి ప్రధానికి లేఖ రాసింది, కానీ ఏమీ జరగలేదు. అలాగే, విదేశీ విరాళాల నియంత్రణ చట్టం కింద ఇప్పటివరకు 20,000కు పైగా సంస్థలు తమ లైసెన్స్‌లను కోల్పోవడంపై మీ స్పందన ఏమిటి?

జ: మొదటిగా, మైనారిటీ వర్గాల సంక్షేమాన్ని చూసే బాధ్యత నాపై ఉంది, కానీ శాంతిభద్రతలు మైనారిటీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ పరిధిలోని అంశం కాదు. ఒక ఉదాహరణ చెప్పాలంటే, 2015 దిల్లీ ఎన్నికలకు ముందు, దిల్లీలో చర్చిలపై దాడులు జరిగాయని వార్తలు వచ్చాయి. నేను దిల్లీ పోలీస్ కమిషనర్‌ను పిలిపించి గణాంకాలు అడిగాను; అక్కడ నాలుగు సంఘటనలు జరిగాయి. నేను మూడు నెలల కాలంలో జరిగిన సంఘటనల వివరాలు అడిగాను. దేవాలయాలకు సంబంధించి 300 కంటే ఎక్కువ, గురుద్వారాలకు సంబంధించి సుమారు 150, మసీదులకు సంబంధించి దాదాపు 100 సంఘటనలు జరిగాయి. కానీ వార్తలు మాత్రం కేవలం చర్చిలపై దాడుల గురించే వచ్చాయి. ఆ తర్వాత దిల్లీ ఎన్నికలు ముగిసిన వెంటనే ఆ వార్తలు ఆగిపోయాయి. ఒక లౌకిక దేశంలో ఇలాంటి ప్రచారాలు చేయడం తగునా? చర్చిల విషయంలో సంఘటనలు జరిగితే, కాశ్మీర్, అస్సాం, బెంగాల్, కర్ణాటక వంటి చోట్ల హిందువులపై కూడా దాడులు జరుగుతున్నాయి… అది ఎక్కడైనా జరగవచ్చు. ఒక సంఘటన జరిగినంత మాత్రాన అది జాతీయ సమస్య అయిపోదు. ఇక విదేశీ విరాళాల చట్టం విషయానికొస్తే, దీనివల్ల కేరళలో బిజెపికి ఐదు శాతానికి పైగా ఓట్లు తగ్గాయని ఎవరో అన్నారు. మేము ఓట్ల కోసం ఏమీ చేయడం లేదు. ఈ చట్టానికి సంబంధించి ఒక ప్రధాన సవరణను 2010లోనే యూపీఏ ప్రభుత్వం చేసింది. ఇది అప్పటికే అమలులో ఉంది.

ప్ర: కానీ మీరు ఎన్నికలకు ఏడు రోజుల ముందు ఈ పని చేశారు కదా.

జ: లేదు, అమలు ప్రక్రియ నిరంతరం కొనసాగుతూనే ఉంది. గత 12 ఏళ్లలో 20,000కి పైగా FCRA లైసెన్స్‌లు రద్దయ్యాయి… ఎన్నో రద్దులు జరిగాయి కానీ అప్పీలు చేసుకోవడానికి అవకాశాలు కల్పిస్తున్నాము. ఒకవేళ రద్దు ఏకపక్షంగా అనిపించినా, లేదా వారి వాదనను వినిపించడానికి తగినంత సమయం ఇవ్వకపోతే, అది సంబంధిత న్యాయ సూత్రాలను ఉల్లంఘించినట్లు అవుతుంది. దాన్ని పరిశీలిస్తాం. కానీ ఇది ఎవరినీ లక్ష్యంగా చేసుకుని చేసింది కాదు. ఇది ఏ ఒక్క మత సమూహానికి ఉద్దేశించిన చట్టం కాదు. ఇది అందరికీ వర్తించే చట్టం. క్రైస్తవ సమాజం నుంచి ఏదైనా ఫిర్యాదు వస్తే మేము కచ్చితంగా పరిష్కరిస్తాం, కానీ మిషనరీలను మాత్రమే లక్ష్యంగా చేసుకుని ఈ కార్యక్రమం జరుగుతోందని అనడం తప్పు.

ప్ర: లోక్‌సభ స్థానాలను 543 నుంచి 816కి, అంటే దాదాపు 272 స్థానాలను పెంచాలని ప్రభుత్వం ప్రతిపాదించింది. దీనివల్ల ప్రభుత్వంపై, ప్రజలపై పడే ఆర్థిక భారం ఎంత ఉంటుందో చెప్పగలరా? రెండోది, మహిళలకు రిజర్వేషన్లు ఇవ్వాలని ప్రభుత్వం నిజంగా భావిస్తే ప్రస్తుతం ఉన్న సీట్ల సంఖ్యతోనే రిజర్వేషన్లు ఇవ్వడానికి మిమ్మల్ని అడ్డుకుంటున్నది ఏమిటి?

జ: దాదాపు 80 శాతం రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలలో ఎంపీల కంటే ఎమ్మెల్యేల జీతాలు ఎక్కువగా ఉన్నాయి. ఎన్నికైన సభ్యుల జీతభత్యాలు, ఇతర వసతుల భారం రాష్ట్ర ఖజానాపై పడుతుంది. ఎదుగుతున్న దేశంగా భారతదేశానికి ఈ బాధ్యతను నిర్వహించడంలో ఎలాంటి ఇబ్బందులు ఉండవు. కచ్చితంగా చిన్న రాష్ట్రాలపై ఎక్కువ భారం పడుతుంది, కానీ పెద్ద రాష్ట్రాలకు ఇది పెద్ద సమస్య కాదు, ఎందుకంటే జీతాల పరంగా కొన్ని కోట్లు మాత్రమే ఖర్చవుతుంది. ఒక ఎంపీ జీతం కేవలం ఒక లక్ష రూపాయలు మాత్రమే. మంత్రిగా నాకు జీతం రాదు, కాబట్టి పెద్దగా భారం ఏమీ లేదు. మొత్తం సభ్యుల సంఖ్య పెరగడం ఎందుకు అవసరమనే విషయానికొస్తే, ఉత్తరప్రదేశ్ వంటి ప్రాంతాలలో ఒక ఎమ్మెల్యే దాదాపు నాలుగు లక్షల మంది ప్రజలకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు, ఇది యూరప్‌లోని 20 మంది ఎంపీలతో సమానం. ఎన్నికైన ప్రతినిధి మొత్తం ప్రాంతాన్ని తిరగలేకపోతే లేదా ప్రజలను కలవలేకపోతే, అది ఒక లోపంగా మారుతుంది, దాన్ని సరిదిద్దాలి. నిజానికి, మీకు ప్రజాస్వామ్యంపై అంత ఆందోళన ఉంటే, కేవలం 850 సీట్లు మాత్రమే ఎందుకు అని మీరు ప్రశ్నించాలి.

ప్ర: ‘కాక్రోచ్ జనతా పార్టీ’ నిర్వహిస్తున్న నిరసనలపై మీ అభిప్రాయం ఏమిటి?

జ: రాజకీయ పార్టీని ఎవరైనా స్థాపించవచ్చు. కానీ భారత ప్రజాస్వామ్యాన్ని తక్కువ చేసి చూపించవద్దు, హేళన చేయవద్దు. సిజేపీ కేవలం కాంగ్రెస్ పార్టీకి మాత్రమే సవాలు విసురుతోంది. ఆందోళన చెందాల్సింది వారే.

ప్ర: దేశంలో కాంగ్రెస్‌కు మూడు రాష్ట్రాల్లో ప్రభుత్వాలు ఉన్నాయి, లెఫ్ట్ పార్టీలకు ఎక్కడా లేదు. మరి అధికారంలో ఉన్న 12వ ఏట బిజెపికి ఇది ఇంత పెద్ద సవాలుగా ఎలా మారుతోంది?

జ: భారత ప్రజలు తమ వాదనలను కానీ, తమ నాయకత్వాన్ని కానీ అంగీకరించడం లేదనే విషయాన్ని కాంగ్రెస్, లెఫ్ట్ పార్టీలు అర్థం చేసుకోవాలి. అయినప్పటికీ మోదీ విఫలమయ్యారని, బిజెపి విఫలమైందని వారు అంటున్నారు. ప్రభుత్వం విఫలమైందనే ఈ ప్రచారాన్ని వారు ఇకనైనా ఆపాలి. ప్రజలు ప్రభుత్వాన్ని ఆమోదించారు… వారు పేపర్లలో, సోషల్ మీడియాలో బలంగా ఉండవచ్చు, కానీ మేము వారిని తిప్పికొడుతున్నాము.

ప్ర: కానీ ప్రజాస్వామ్యంలో ప్రతిపక్షానికి స్థానం లేదా?

జ: ప్రజలే వారిని తిరస్కరిస్తే, దానికి మమ్మల్ని ఎలా నిందిస్తారు?

ప్ర: గత కొన్నేళ్లుగా పార్లమెంటులో ఉత్పాదకత ఎక్కువగా ఉన్నప్పటికీ, కమిటీలకు వెళ్లే బిల్లుల సంఖ్య తగ్గడాన్ని, అతి తక్కువ సమయంలోనే ఎక్కువ బిల్లులు ఆమోదం పొందడాన్ని చూస్తున్నాం. ఇది ఆందోళన కలిగించే విషయమేనా, దీన్ని మీరు ఎలా పరిష్కరిస్తారు?

జ: కొన్ని విషయాల్లో మీరు చెప్పింది నిజమే. గత కొన్ని సంవత్సరాలలో ఆమోదించిన బిల్లుల సంఖ్య తక్కువేమీ కాదు, కానీ చర్చకు ఇచ్చిన సమయం తక్కువ. ఎందుకంటే సమావేశాలు ప్రారంభమైనప్పటి నుంచి కాంగ్రెస్ పార్టీ సభా నిబంధనలను ఉల్లంఘించి సభావేదిక లోకి దూసుకువచ్చి ‘మీ ప్రధాని దొంగ’ అంటూ నినాదాలు చేయడం ప్రారంభిస్తుంది. దీనివల్ల బిల్లులు బలిపశువులవుతున్నాయి. చర్చలకే అనుమతించనప్పుడు బిల్లులను ఎలా పరిశీలిస్తారు? మొదటిగా, వారు వాదోపవాదాలకు, చర్చలకు అనుమతించాలి. ఆ సమయంలో అవసరమైతే బిల్లులను పార్లమెంటరీ స్థాయీ సంఘం లేదా జేపీసీకి పంపుతారు. అది సభ నిర్ణయించాల్సి ఉంటుంది. కానీ సభ ప్రారంభమైన వెంటనే ఎంపీలు ప్లకార్డులతో రావడంతో సభ మళ్లీ వాయిదా పడుతోంది.

ప్ర: ఎన్డీయే ప్రభుత్వం 13వ ఏడాదిలోకి అడుగుపెడుతోంది. పాలన విషయానికొస్తే, మీ నిజమైన సవాళ్ళేమిటి?

జ: ప్రస్తుతానికైతే పశ్చిమాసియా సంక్షోభం. మనకు కావలసిన చమురు, గ్యాస్‌లో 80 శాతం హోర్ముజ్ జలసంధి ద్వారానే వస్తుందనేది వాస్తవం. మనం మన ఇంధన వనరులను వైవిధ్యభరితం చేసుకున్నామని ప్రధాని ఇప్పటికే లోక్‌సభ, రాజ్యసభలలో స్పష్టం చేశారు. హరిత, స్వచ్ఛ ఇంధనం వైపు మారడానికి మేము అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నాం. పశ్చిమాసియా సంక్షోభం కారణంగా ప్రభుత్వంపై భారీ భారం పడింది. ఎక్సైజ్ సుంకాన్ని 10 రూపాయలు తగ్గించడం వల్ల మాకు రూ.1 లక్ష కోట్లకు పైగా నష్టం వాటిల్లింది. చమురు ధరల పెరుగుదల కేవలం ఐదు శాతం లోపే ఉన్న అతికొద్ది దేశాలలో భారతదేశం ఒకటి. అయినప్పటికీ, ప్రతిపక్ష పార్టీలు రచ్చ చేస్తూనే ఉన్నాయి. ఇటువంటి సంక్షోభ సమయంలో ప్రతి ఒక్కరూ ప్రభుత్వానికి మద్దతుగా నిలవాలి. బాహ్య లేదా అంతర్గత సంక్షోభం ఏర్పడినప్పుడు ప్రజలు ప్రభుత్వానికి అండగా నిలవడం ఎప్పటి నుంచో వస్తున్న ఆచారం.

ప్ర: మరి యువత ఆకాంక్షల సంగతి ఏమిటి? యువతలో అసంతృప్తి పెరుగుతుండటం మనం చూస్తున్నాం. అది మిమ్మల్ని ఆందోళనకు గురిచేయడం లేదా?

జ: యువత ఆకాంక్షలు కచ్చితంగా పెరిగాయి. భారతదేశంలోని యువతకు తమ అవసరాలు, హక్కులపై మరింత అవగాహన వచ్చింది. కానీ వాటితో పాటు, దేశం పట్ల తమకున్న బాధ్యతలు, విధులను కూడా వారు గుర్తించాలి. యువత దేశానికి అతిపెద్ద ఆస్తి, భారత్ వృద్ధికి వారి భాగస్వామ్యం ఎంతో అవసరం.

నాగార్జున